చెక్ పోస్టుల ఎత్తివేతకు రంగం సిద్ధం!

by Mahesh |
చెక్ పోస్టుల ఎత్తివేతకు రంగం సిద్ధం!
X

దిశ, నాగార్జునసాగర్: రాష్ట్ర ఖజానాను నింపడం తో పాటు అక్రమ రవాణాకు చెక్ పెట్టడంలో కీలకంగా వ్యవహరించే అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఎత్తేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు సరిహద్దు అంతరాష్ట్ర రవాణా చెక్ పోస్టులను లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఎత్తివేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల 90 శాతం అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నాయని చెప్పాలి. వాస్తవానికి జీఎస్టీ అమల్లోకి రాకముందే ఈ చెక్‌పోస్టులు వాణిజ్య పన్నుల శాఖ చేతిలో కీలకంగా వ్యవహరించేవి. కానీ జీఎస్టీ అమల్లోకి రావడంతో అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు కేవలం రవాణా చెక్‌పోస్టులుగా మిగిలిపోయాయి.

వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు ఎత్తేయకముందు నిత్యం రూ.కోట్లల్లో పన్నులు వసూలయ్యేవి. ప్రభుత్వం గల్లా పెట్టే కళకళలాడేది. అనంతరం రవాణా శాఖ చెక్‌పోస్టులుగా మారినప్పటికీ ప్రభుత్వానికి మస్తు ఆదాయం సమకూరేది. కొంతమేర అవినీతి ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. అవినీతి జరుగుతుందన్న పేరుతో ఏకంగా చెక్‌పోస్టులు ఎత్తేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతరాష్ట్ర చెక్ పోస్టుల మూలంగా 90 శాతం అక్రమ వ్యాపారాలకు చెక్ పడుతుంది. పీడీఎస్ బియ్యం, గంజాయి, డ్రగ్స్ ఇతరత్రా అక్రమ వ్యాపారాలకు ఈ అంతరాష్ట్ర చెక్‌పోస్టులు నియంత్రణగా మారాయి. కానీ తాజాగా చెక్‌పోస్టులను ఎత్తివేయాలనే నిర్ణయం సరికాదని ప్రజల నుంచి విన్పిస్తోంది.

చెక్‌పోస్టులు ఉంటేనే జీరో వ్యాపారాలకు చెక్..

అంతరాష్ట్ర చెక్‌పోస్టులు ఉంటేనే జీరో వ్యాపారాలకు చెక్ పడుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోదాడ, వాడపల్లి, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు కీలకంగా ఉన్నాయి. ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలంటే.. ఈ చెక్‌పోస్టులను తప్పనిసరిగా దాటాల్సిందే. అయితే ఈ క్రమంలోనే బిల్లులు లేకుండా సరుకును తరలించే వాహనాలకు ఇక్కడ చెక్ పడుతుంది. బిల్లులు లేకుండా వెళ్లే గూడ్స్ వాహనాలకు ఇక్కడ అధికారులు తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తుంటారు. అసలే వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టులు ఎత్తివేయడంతో అక్రమ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఈ అంతరాష్ట్ర రవాణా శాఖ చెక్ పోస్టులు ఎత్తేస్తే అక్రమార్కులు వ్యాపారం మూడు పూలు.. ఆరు కాయలుగా విరాజిల్లడం ఖాయం. ఎస్టిమేషన్‌ బిల్లులతో సరుకుల అక్రమ తరలింపునకు వ్యాపారులు తెరలేపినట్లు తెలుస్తోంది.

ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా వందలాది లారీలు, కంటైనర్‌లు సరుకులతో వస్తూ పోతున్నాయి. దీంతో పన్నుల రూపేనా ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి వ్యాపారులు పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. ఏ సరుకును అయినా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీ సుకువెళ్లాలంటే బిల్లులు, వే బిల్లులు తప్పనిసరి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక వే బిల్లులతో సరుకుల రవాణా చేయాలని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. క్షే త్ర స్థాయిలో వ్యాపారులు ఈ నిబంధనలు పాటించడం లేదు. ఎలాంటి బిల్లులు లేకుండా నిత్యం 120 నుంచి 200 లారీల వరకు వివిధ రకాల సరుకులు, వస్తువులను ఉమ్మడి జిల్లా నుంచి చేరుతున్నాయి. ఏపీ నుంచి సుమారు 200 లారీల్లో వివిధ సరుకులు ఇక్కడికి వస్తున్నాయి. సరిహద్దుల వద్ద తనిఖీలు లేకపోవడం, ప్రైవేటు బస్సులు, వాహనాలను మార్గమధ్యలో నిలిపి అధికారులు తనిఖీలు చేయకపోవడంతో సరిహద్దులు దాటి సరుకు అక్రమ రవాణా జోరుగా సాగే అవకాశం ఉంది.

ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ఊసేది..?

గతంలో అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల స్థానంలో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ, ఏపీల మధ్య ఏర్పాటు చేయతలపెట్టిన 7 చెక్‌పోస్టులతోపాటు ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక సరిహదుల్లో ఉన్న మరో 7 చెక్‌పోస్టులను ఇంటిగ్రేటెడ్(సకల హంగులతో గల చెక్‌పోస్టులు)గా మార్చాలని గతంలో అభిప్రాయానికి వచ్చారు. సీసీ కెమెరాలతో పాటు స్కానర్లు, జీపీఎస్ విధానం, ఇతర అధునాతన హంగులన్నీ ఉండే ఈ చెక్‌పోస్టుల వద్దకు లారీ వస్తే అందులో ఉన్న సరుకు ఏంటో, ఏ రాష్ట్రం నుంచి వస్తోందో కనుగొనే వీలు కలిగేలా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా చెక్ పోస్టులను ఎత్తి వేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు లేకపోలేదు.

చెక్‌పోస్టులు ఎత్తివేస్తే భారీ నష్టం..

ఏపీ వైపు ఉన్న చెక్‌పోస్టులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. తెలంగాణ సైతం అదే తరహాలో అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఎత్తేస్తే ఊహించని విధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి బిల్లులు లేకుండానే వ్యాపారులు యథేచ్ఛగా ప్రతి రోజు వందల సంఖ్యలో ట్రక్కులు, లారీల్లో సరుకులను తరలించే అవకాశం ఉంటుంది. నాగార్జునసాగర్‌లోని చెక్‌పోస్టు నుంచి నిత్యం 120 నుంచి 200 వరకు సిమెంట్‌ లారీలు, ఇరవై లారీల మార్బుల్‌, వందలాది వాహనాల లోడ్‌ల పప్పుదినుసులు, విత్తనాలు, ఎరువులు, 15 లారీల్లో ప్లాస్టిక్‌ వ స్తు సామగ్రి, 10 లారీల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులు వస్తుంటాయి. అయితే ప్రస్తుతం వీటి నుంచి ప్రభుత్వానికి ఆదాయం అందుతుంది.

కానీ ప్రభుత్వం చెక్‌పోస్టులను ఎత్తేస్తే ఇలా ఏవీ పన్నులు చెల్లించకుండానే సరిహద్దులు దాటేస్తాయి. మరోవైపు ఏపీలోని గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు నాగార్జునసాగర్ నుంచే అధికంగా గూడ్స్ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారు. చెక్ పోస్టులు ఎత్తేస్తే అక్రమ వ్యాపారాలను అధికారులే ప్రోత్సహించినట్టు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా ఏపీ నుంచి రాష్ట్ర రాజధానితో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఏ వస్తువులు తరలుతున్నాయనే దానిపై లెక్క పత్రం లేకుండా పోతుంది. దీనికితోడు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలు పన్ను రూపంలో వచ్చే ఆదాయం ప్రభుత్వాలు నష్టపోవాల్సి వస్తుంది.



Next Story