ట్రాక్టర్‌ మార్చ్‌‌తో హైవేలపై హోరెత్తించిన రైతులు

by Dishanational4 |
ట్రాక్టర్‌ మార్చ్‌‌తో హైవేలపై హోరెత్తించిన రైతులు
X

దిశ, నేషనల్ బ్యూరో : తమ డిమాండ్లను నెరవేర్చాలని కేంద్ర సర్కారును కోరుతూ రైతన్నలు ఢిల్లీ బార్డర్‌తో పాటు యూపీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగించారు. సంయుక్త కిసాన్ మోర్చా సహా పలు రైతు సంఘాల పిలుపు మేరకు ఆయా రాష్ట్రాల్లోని జాతీయ రహదారులపై రైతులు ట్రాక్టర్‌ మార్చ్‌ చేపట్టారు. దీన్ని అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలో ఉన్న యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఎంట్రీ పాయింట్‌ వద్ద రైతుల ట్రాక్టర్‌ మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్స్‌ప్రెస్‌వేపై ర్యాలీ చేయడానికి వారిని అనుమతించలేదు. ఈసందర్భంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) దిష్టిబొమ్మలను రైతు సంఘాల నేతలు దహనం చేశారు. డబ్ల్యూటీఓ దేశాల చర్చల ఎజెండా నుంచి వ్యవసాయ అంశాలను తొలగించాలని కోరారు.యూఏఈ దేశంలోని అబుధాబి నగరంలో ఫిబ్రవరి 26 నుంచి నాలుగు రోజుల పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ 13వ సదస్సు జరుగనుంది. ఇందులో దాదాపు 164 సభ్యదేశాల వాణిజ్య మంత్రులు పాల్గొంటున్నారు. అందుకే ఇప్పుడు డబ్ల్యూటీఓ అంశాన్ని ఇంత బలంగా రైతన్నలు లేవనెత్తారు.

శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో..

ప్రస్తుతానికి శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగానే ఉంది. ఈ దఫా రైతు ఉద్యమంలో ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారు. వీరిలో నలుగురు రైతులు, ముగ్గురు పోలీసు సిబ్బంది ఉన్నారు. ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయిన శుభకరన్ సింగ్ పోస్టుమార్టం ఇంకా జరగలేదు. ఈ వ్యవహారంపై హర్యానా పోలీసులపై కేసు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీకి 200 కి.మీ దూరంలోని ఖనౌరీ, శంభూ ప్రాంతాల్లో తిష్టవేసిన వేలాది మంది రైతులు ట్రాక్టర్‌ ట్రాలీలతో ఢిల్లీ వైపు కదం తొక్కారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారంటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ ముందుకు సాగగా, భద్రతా దళాలు వారిని ఆపేశాయి. ఇక రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేయాలనే నిర్ణయాన్ని ఫిబ్రవరి 29కి వాయిదా వేసుకున్నారు.



Next Story