అధికారంలో రాగానే కుల గణన, అగ్నిపథ్ రద్దు: ఎస్పీ మేనిఫెస్టో

by Dishanational1 |
అధికారంలో రాగానే కుల గణన, అగ్నిపథ్ రద్దు: ఎస్పీ మేనిఫెస్టో
X

దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ప్రధానంగా 2025 నాటికి కుల గణన, అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. 'జనతా కా మాంగ్ పాత్ర - హుమారా అధికార్' అనే పేరుతో మేనిఫెస్టోను పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఎస్పీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్.. కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ఏర్పాటైన తర్వాత కుల గణన నిర్వహిస్తామన్నారు. అలాగే 2025 నాటికి ఖాళీగా ఉన్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల అన్ని ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేసి సాయుధ దళాలకు రెగ్యులర్ రిటైర్‌మెంట్ వర్తించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని, ప్రైవేట్ రంగంలో సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండేలా చూస్తామని, 2029 నాటికి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని పార్టీ హామీ ఇచ్చారు. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వడం, రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం, ఉచిత నీటిపారుదల సౌకర్యం కల్పించడం, రైతు కమిషన్ ఏర్పాటు వంటి అంశాలు మేనిఫెస్టోలో పొందుపరిచారు. భూమిలేని చిన్న, సన్నకారు రైతులందరికీ నెలకు రూ. 5,000 పెన్షన్ అందజేస్తానని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. మహిళలపై నేరాల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడంతోపాటు దేశవ్యాప్తంగా హెల్ప్‌లైన్‌, డీలిమిటేషన్‌ కోసం ఎదురుచూడకుండా అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పార్లమెంట్‌, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, మహిళలకు 33 శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటి హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయి. రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌, మీడియా స్వేచ్ఛా హ‌క్కు, సామాజిక న్యాయ హ‌క్కు దేశ అభివృద్ధికి కీల‌క‌మ‌ని విజ‌న్ డాక్యుమెంట్‌లో పొందుప‌రిచినట్టు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు.



Next Story

Most Viewed