Aadhaar card : 81.5 కోట్ల మంది ఆధార్ డేటా లీక్!

by Disha Web Desk 10 |
Aadhaar card : 81.5 కోట్ల మంది ఆధార్ డేటా లీక్!
X

న్యూఢిల్లీ: దేశచరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ బయటపడింది. ఆధార్ కార్డులోని భారతీయుల బయోమెట్రిక్ వివరాలు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్టు వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపుతోంది. యూఎస్ ఆధారిత సైబర్‌ సెక్యూరిటీ సంస్థ రీసెక్యూరిటీ నివేదిక ప్రకారం, పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలతో పాటు ఆధార్, పాస్‌పోర్ట్ సమాచారం వంటి వివరాలు ఆన్‌లైన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఆధార్‌లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్‌ వివరాల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 9న పీడబ్ల్యూఎన్0001 అనే నకిలీ పేరుతో ఉన్న ఒక వ్యక్తి 81.5 కోట్ల మంది భారతీయ పౌరుల ఆధార్ వివరాలను బ్రీచ్‌ఫోరమ్స్‌లో పోస్ట్ చేసినట్లు రీసెక్యూరిటీ సంస్థ తెలిపింది. తమ వద్దనున్న డేటాకు సాక్ష్యంగా కొన్ని శాంపిల్స్‌ను కూడా అజ్ఞాత వ్యక్తి బహిర్గతం చేసినట్టు సమాచారం. ఒక్కో శాంపిల్‌లో లక్ష మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఈ సమాచారాన్ని ఐసీఎంఆర్ అధికారులు తమవద్ద ఉన్న డేటాతో పోల్చి చూడగా, సరిగ్గా సరిపోయాయి. ఈ కారణంతోనే డేటా లీకైందనే స్పష్టతకు వచ్చినట్టు అంచనా.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వద్ద ఉండాల్సిన భారతీయుల వివరాలు సైబర్‌ నేరగాళ్లకు చేరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై ఐసీఎంఆర్ నుంచి ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తుకు సీబీఐ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఐసీఎంఆర్ సర్వర్లపై సైబర్ దాడులు జరుగుతున్నాయి. గడిచిన ఎనిమిది నెలల కాలంలో దాదాపు 6,000 సార్లు ఈ దాడులు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలపై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర సంస్థలు హెచ్చరించాయి. అయినప్పటికీ డేటా చోరీ జరిగిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ సంస్థలు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంలో విదేశీ వ్యక్తుల హస్తమున్నట్టు సందేహాలున్నాయి. మున్ముందు మరింత నష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

ముందుజాగ్రత్తలో లోపమే ఇందుకు కారణమా..

ఆధార్ వివరాలు సురక్షితంగా లేవని, వాటిని ఎవరైన దొంగలించే అవకాశాలు ఉన్నాయని ఇటీవల క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీతో పాటు పలు పరిశోధనా సంస్థలు హెచ్చరించాయి. కానీ, వాటిని కేంద్ర సంస్థలు తోసిపుచ్చాయి. దేశంలోని పౌరులకు సంబంధించిన ప్రతీ గుర్తింపు ఆధార్‌తో అనుసంధానం చేయబడింది. చాలావరకు ఆర్థిక లావాదేవీలు డిజిటల్‌గానే జరుగుతున్నాయి. ఈ మధ్యనే కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఓటర్ల వివరాలను ఆధార్‌కు లింక్ చేసింది. ఇప్పటివరకు 94.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటర్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేశారు. ఈ నేపథ్యంలో తాజా డేటా చోరీతో సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ బ్యాంకింగ్, ట్యాక్స్ రీఫండ్, ఇతర ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనం ఏం చేయాలంటే..

దేశంలోని అందరికీ ఆధార్ కీలకమైన సమాచారం ఉన్న గుర్తింపు కార్డు కావడంతో బ్యాంకు ఖాతాలకు అనుసంధానం అయి ఉంటాయి. కాబట్టి బ్యాంకు ఖాతాలు, ఇతర పాస్‌వర్క్ వంటి వాటిని తరచుగా మార్చడం మంచిది. సాధారణ పాస్‌వర్డ్‌లు కాకుండా అత్యంత కఠినమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం సురక్షితమని నిపుణులు సైతం సూచిస్తున్నారు. దీనివల్ల సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి.


Next Story