ఎన్‌డీఏ కూటమికి 400+ సాధ్యమే.. ‘ఇండియా’ కూటమి బలహీనమైంది : ఒమర్

by Dishanational4 |
ఎన్‌డీఏ కూటమికి 400+ సాధ్యమే.. ‘ఇండియా’  కూటమి బలహీనమైంది : ఒమర్
X

దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమి 400కుపైగా సీట్లు సాధించడం సాధ్యమయ్యే విషయమేనని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ప్రతిపక్షాల బలహీనతే ఎన్‌డీఏకు బలంగా మారే ఛాన్స్ ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘రెండు నెలల క్రితం వరకు.. ఎన్‌డీఏ కూటమి 400కు పైబడి సీట్లను సాధించడం కష్టమనే వాతావరణం కనిపించింది. ఇప్పుడు పరిస్థితులు మారాయని స్పష్టమవుతోంది. ఎన్డీఏపై వ్యతిరేకత అంత బలంగా కనిపించడం లేదు. కనీసం లోక్‌సభ ఎన్నికల నాటికైనా విపక్షాలు విభేదాలను విడనాడాలి. ఐకమత్యంగా ముందుకు సాగితేనే ఎన్‌డీఏను ఢీకొనడం సాధ్యమవుతుంది’’ అని ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. ‘‘ఇండియా కూటమి ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది. ఈ గందరగోళానికి కారణం కాంగ్రెస్ కాదు. నితీష్ కుమార్ సహా పలువురు వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయారు. విపక్ష కూటమి ఏర్పాటు దిశగా మా ప్రయత్నాలు విఫలమయ్యాయి’’ అని ఆయన తెలిపారు. ‘‘బీజేపీ దగ్గర డబ్బు బలం, మందిరం నినాదం, బలమైన క్యాడర్ మూడూ ఉన్నాయి. వాళ్లు మళ్లీ అధికారంలోకి రావడానికి వీటిలో దేన్నైనా వాడుకుంటారు. ప్రతిపక్షం అన్ని విషయాల్లోనూ బలహీనంగా ఉంది. బీజేపీని ఎదుర్కోవడం పెద్ద సవాలే’’ అని ఒమర్ అబ్దుల్లా వివరించారు.



Next Story

Most Viewed