బొగ్గు రవ్వలు ఉద్యమాలకు దస్తావేజు

by Disha edit |
బొగ్గు రవ్వలు ఉద్యమాలకు దస్తావేజు
X

ఉద్యమం, పోరాటం ఆనాటి జీవితం సమాజం ఎత్తుగడలు సామాజిక చరిత్రలో నమోదు కావాలంటే అందులో పనిచేసిన వారు వాటికి అక్షర రూపం ఇవ్వాల్సిందే. లేకుంటే ఒక తరం మారకముందే జ్ఞాపకానికి అందవు. తెలుగునేల మీద తెలంగాణ సాయుధ పోరాటం, భారత స్వాతంత్ర్య సంగ్రామం, భూస్వామ్య వ్యతిరేక, నక్సలైట్ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమం ఇటీవలి మలిదశ పోరాటం ఇవన్నీ ఉన్నదున్నట్టుగా చరిత్రలో రికార్డ్ కావాల్సిన పోరాటాలు. వీటి వల్ల భవిష్యత్ తరాలకు చరిత్ర తెలుస్తది. అందులో స్వయంగా పాల్గొన్న వారు పుస్తకాలు రాయకుంటే ఇతరులు తెలుసుకొని రాసిన చరిత్రలో అనేక సంఘటనలు రికార్డ్ కాకపోవచ్చు.

ఇటీవల గురజాల రవీందర్ సింగరేణి ప్రాంతంలో పోరాటం నిర్వహించిన సికాసతో తన అనుబంధాన్ని తను ఎట్ల ఉద్యమంలోకి వెళ్ళింది అద్భుతంగా వెలువరించాడు. ఆ పుస్తకం పేరు 'బొగ్గు రవ్వలు'. పర్‌స్పెక్టివ్ వారు ప్రచురించారు. అందులో రవీందర్ తాను జమ్మికుంటలో 1958లో జన్మించిన నుంచి చిన్నమామతో స్నేహం తర్వాత ఉద్యమంలోకి ఎలా వెళ్లాడు, అడవి పోరాటాన్ని అనుభవైకంగా వివరించిన జ్ఞపకాల తలపోత ఒక నవల లాగా ఆసక్తిగా చదివించే శైలి ఇందులో ఉన్నది. గురజాల రవీందర్ దశాబ్దకాలం విప్లవ ఉద్యమ ప్రస్థానంలో ఉన్నారు. నిర్భంధం, జైలు జీవితం అనుభవించారు. అనంతర కాలంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ జె.‌ఎఫ్.సి నిర్మాణంలోనూ రాష్ట్ర స్థాయిలో ముఖ్య భూమిక పోషించారు. సింగరేణి కోల్ బెల్ట్‌లో 1980 దశకంలోని కార్మికులు.. దొరల దౌర్జన్యాలు వంటి విషయాలు ఈ పుస్తకం చదివితే సింగరేణేతరులకు కూడా తెలుస్తాయి.

ఉద్యమంలో పని చేసిన వాళ్లు తప్పనిసరిగా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. మలిదశ తెలంగాణ ఉద్యమం గూర్చి లాంగ్ మార్చ్ పేర పెద్దింటి అశోక్ కుమార్ ఒక నవల రాశారు. కొన్ని కథలు వచ్చాయి గానీ ప్రముఖంగా పాల్గొన్న మేధోపరంగా రచనానుభావం ఉన్నవాల్లు ఇంకా పుస్తకాలు సమగ్రంగా రాయలేదు. తెలంగాణ సాయుధ పోరాటం మీద పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్లు ఇంగ్లీష్‌లో కూడా చాలా పుస్తకాలు వెలువరించారు. తెలంగాణ సాయుధ పోరాటం వరకు మేర మల్లేశం స్వీయ చరిత్ర- పాటలు కూడా పుస్తక రూపంలో వెలువరిస్తున్నారు. ఆ పోరాటంలో పాల్గొన్న ఆత్మకథ ఇందులో ఉంటుంది. నక్సలైట్ ఉద్యమానికి సంబంధించి హుస్నాబాద్ ప్రాంతంలో నుంచి జర్నలిస్ట్ మంగళరపు లక్ష్మణ్, 'నెత్తుటి గాయాల చరిత్ర' పేర ఇటీవల ఒక పుస్తకం వెలువరించారు. అంతకుముందు హుజురాబాద్ కేంద్రంగా ఆవునూరి సమ్మయ్య 'గవాయి' పేర ఆ ప్రాంత సమగ్ర చరిత్రక వ్యాసాల సంకలనం వెలువరించారు.

ఉద్యమాలను రికార్డ్ చేయడం అందులో పాల్గొన్న అందరికీ సాధ్యం కాకపోవచ్చు అందులోనే కొనసాగితే రాసేంత వెసులుబాటు దొరకకపోవచ్చు. బయటకు వచ్చి విశ్రాంత జీవనంలో ఉన్నవారు ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకొని రాయాల్సి ఉంది. గురజాల రవీందర్ వెలువరించిన బొగ్గు రవ్వలు సింగరేణి కార్మిక ఉద్యమాలకు ఒక దస్తావేజులాగా ఉన్నది.

ప్రతులకు

‘బొగ్గురవ్వలు’

పుటలు -150. వెల 220

నవోదయ బుక్‌‌హౌజ్

అన్నవరం దేవేందర్

94407 63479



Next Story

Most Viewed