కాలేజీ, గుడి రోడ్డులో మద్యం దుకాణం

by  |
కాలేజీ, గుడి రోడ్డులో మద్యం దుకాణం
X

దిశ, భద్రాచలం(చర్ల): చర్లలో ఎక్కడా స్థలం లేనట్లు ఒకవైపు కళాశాల విద్యార్థులు, మరోవైపు సాయినాథుని భక్తులు, ఇంకోవైపు ప్రభుత్వ కార్యాలయాలకు రాకపోకలు సాగించే ప్రజలు రద్దీగా తిరిగే కాలేజీ రోడ్డులో నివాస గృహాల దగ్గర మద్యం దుకాణానికి ఏర్పాట్లు చేస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణం ఏర్పాటుకి ఇంతకన్నా అనువైన ప్రదేశం చర్లలో లేదా అని మహిళలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాయిబాబా భక్తులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రూటులో ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాయిబాబా టెంపుల్, నాగులమ్మ గుడి, ఎంపీడీవో ఆఫీస్, ఐసీడీఎస్ ఐకేపీ, ట్రాన్స్‌కో, ఎంఈవో కార్యాలయాలు ఉన్నాయి.

ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ రోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే మందుబాబుల లొల్లితో జనం ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని మండల ప్రజలు, స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో దుకాణం పెట్టవద్దని ఆ రోడ్డులో నివసించే కుటుంబాల ప్రజలు, మహిళలు, కళాశాల విద్యార్థులు ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ పబ్లిక్ డిమాండ్‌ని పెడచెవిన పెట్టి అధికారుల సపోర్టు ఉంటుందనే ధీమాతో మద్యం దుకాణం కోసం హడావుడిగా షెడ్డు నిర్మాణం చేస్తున్న తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. సాయిబాబా రోడ్డుగా పిలుచుకునే ఈ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటుని ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

తమ విన్నపాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎక్సైజ్ అధికారుల సపోర్టుతో మద్యం వ్యాపారులు దుకాణం ఏర్పాటుచేస్తే టెంటువేసి ఆందోళన చేస్తామని విద్యార్థులు, మహిళలు, సాయిబాబా భక్తులు హెచ్చరిస్తున్నారు. ప్రజల డిమాండ్ మేరకు ఈ రోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటు నిర్ణయం మార్చుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని చర్ల ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.


Next Story