నవీ ముంబై బస్సులో 'లైబ్రరీ-ఆన్ వీల్స్‌'.. పుస్తక పఠనానికి చేరువ చేసేందుకే

by Web Desk |
నవీ ముంబై బస్సులో లైబ్రరీ-ఆన్ వీల్స్‌.. పుస్తక పఠనానికి చేరువ చేసేందుకే
X

దిశ, ఫీచర్స్ : మహారాష్ట్రలోని నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ లాంగ్ రూట్ బస్సుల్లో 'లైబ్రరీ-ఆన్ వీల్స్‌'ను ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు పుస్తకాలు చదవడం ద్వారా తమ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. ఈ క్రమంలో 'బస్ లైబ్రరీని' ప్రారంభించిన మొదటి కార్పొరేషన్‌గా ఎన్‌ఎమ్ఎమ్‌సీ(NMMC) నిలిచింది.

పైలట్ ప్రాజెక్ట్‌గా.. బేలాపూర్- మంత్రాలయ, బేలాపూర్-కళ్యాణ్ రూట్లలో రెండు ఎయిర్ కండిషన్డ్ బస్సులలో మొబైల్ లైబ్రరీని ప్రారంభించిన కార్పొరేషన్.. దీనికి సానుకూల స్పందన లభిస్తే 1,000కు పైగా బస్సుల్లో ఈ సర్వీసును ప్రారంభించనుంది. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అబిజిత్ బంగర్, రవాణా మేనేజర్ యోగేష్ కదుస్కర్, లెట్స్ రీడ్ ఇండియా ఫౌండేషన్‌తో కలిసి ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు.


'సోషల్ మీడియాలో కంటెంట్ చదవడం వల్ల అది మనల్ని తప్పుదోవ పట్టిస్తోంది. మన చుట్టూ చాలా తప్పుడు సమాచారం ఉన్నప్పుడు పుస్తక పఠనం చాలా ముఖ్యం. పుస్తకాలు నిజంగా ప్రజలకు నిజమైన స్నేహితులు. అంతేకాదు సోషల్ మీడియా వ్యసనం వల్ల పుస్తక పఠనం మర్చిపోయిన వాళ్లు మరోసారి పాఠకలోకంలోకి అడుగుపెడతారు. ఇక ఉత్తమ పాఠకులు మరిన్ని పుస్తకాలు చదివేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటారు. బస్ లైబ్రరీ అనేది ప్రజలను పుస్తక పఠనానికి చేరువ చేసేందుకు చేస్తున్న ఓ చిన్న ప్రయత్నం. ఇక పుస్తకాలు కాకుండా, ప్రజలు తమ సీట్ల ముందు అతికించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, తమ స్మార్ట్‌ఫోన్‌లలోనూ చదివేందుకు పలు అంశాలను పొందవచ్చు. క్రిప్టో కరెన్సీ, క్లైమేట్ చేంజ్ మొదలైన వివిధ ప్రస్తుత సమస్యలపై రైట్-అప్‌లను పొందుతారు. వారు చదవాలనుకుంటున్న పుస్తకాలపై ప్రయాణికుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామ'ని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అబిజిత్ బంగర్ తెలిపారు.


Next Story