ఆవు పేడతో ఇతర రోగాలు అంటుకునే ప్రమాదం..

by  |
Indian doctors
X

దిశ, ఫీచర్స్: మరణ భయం.. మనిషిని అనాలోచిత నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తుంది. అందులో నిజమెంతో తెలుసుకోకుండా కనిపించిన, వినిపించిన ప్రతీ చిట్కాను ఫాలో అయ్యేలా చేస్తుంది. శాస్త్రీయతను పట్టించుకోకుండా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సలహాలను గుడ్డిగా నమ్మేసే స్థితికి తీసుకొస్తుంది. ఈ తరహా అవగాహనా రాహిత్యం.. అప్పటిదాకా ఉన్న సమస్యలను రెట్టింపు చేయడమే కాక, ప్రాణాల మీదకు తెచ్చిన సందర్భాలు లేకపోలేదు. ఇక ప్రస్తుత కరోనా టైమ్‌లో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు గాను పలువురు ఒంటికి ఆవు పేడను పూసుకుంటున్నారు. ఈ మేరకు వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అనుకుంటున్నారు. కానీ ఇందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోగా, ఇతరత్రా రోగాలు వ్యాప్తిచెందే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

గుజరాత్‌ రాష్ట్రంలో.. ఆవు పేడతో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవచ్చని విశ్వసిస్తున్న వారు వారానికోసారి ఆవుల షెడ్‌కు వెళ్లి, పేడతో పాటు గోమూత్రాన్ని ఒంటికి రాసుకుంటున్నారు. ఈ మేరకు కరోనా వచ్చినా రికవరీ అవుతామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తుండగా.. పలువురు డాక్టర్లు సైతం ఈ థెరపీని ఫాలో అవుతుండటం విశేషం. కాగా, ఈ విషయాల గురించి ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలో అసోసియేట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మనీలా బొరిసా వివరించారు. తమ ఇమ్యూనిటీ పవర్ పెరిగితే, అప్పుడు పేషెంట్లకు ధైర్యంగా ట్రీట్‌మెంట్ అందించవచ్చనే నమ్మకంతో కొందరు డాక్టర్లు వస్తున్నారని తెలిపిన మనీలా.. గతేడాది తను కొవిడ్-19 నుంచి కోలుకునేందుకు ఈ పద్ధతి ఉపయోగపడినట్టు వెల్లడించారు. ఇక ఈ థెరపీ విషయానికొస్తే.. ఆవు పేడ, మూత్రంతో కూడిన మిశ్రమాన్ని ఒంటికి రాసుకుని, పూర్తిగా ఆరిపోయే వరకు వెయిట్ చేయాలి. ఈ క్రమంలో యోగా చేస్తుంటారు. ఆ తర్వాత పాలు లేదా మజ్జిగతో వాష్ చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే, ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు, సైంటిస్టులు.. కొవిడ్-19 కోసం పాటించే ఇతరత్రా చికిత్సా విధానాలు అనర్థాలకు, తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆవు పేడ, మూత్రం కరోనాపై పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచుతుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇవి పూర్తిగా వారి వారి నమ్మకాలు మాత్రమేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ జయలాల్ వెల్లడించారు. అంతేకాదు ఈ ఉత్పత్తులను ఒంటికి రాసుకోవడం లేదా ఔషధాలుగా సేవించడం వల్ల ఇతరత్రా రోగాలు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం ఉందన్నారు. పైగా ఈ షెల్టర్లలో గుంపులు గుంపులుగా పార్టిసిపేట్ చేయడం వల్ల కరోనా స్ప్రెడ్ అయ్యే అవకాశం లేకపోలేదు.



Next Story

Most Viewed