ఇంతకీ ఆదివాసీలదే మతం?

by Disha edit |
ఇంతకీ ఆదివాసీలదే మతం?
X

చిత్రాల రూపంలో బండరాయిపై చెట్ల రసంతో ముదురు ఎరుపు రంగు బొమ్మలు వేయడం ఆదివాసీల అలవాటు. అవి ఇప్పుడు ఆదివాసీలు నివసించే దండకారణ్యాలలో, కొండ గుహలలో కానవస్తున్నాయి. అవి ఆదివాసీలు గీసినట్టు పలువురి పరిశోధనలు తెలిపాయి. తమ అస్థిత్వాన్ని చిత్రాల రూపంలో దాచిన తొలి మానవులు ఆదివాసీలే. వీరికి సింధూ నాగరికతకు సంబంధం ఉంది. దానికి సాక్ష్యం నేటి గోండ్వానా ప్రజల జీవన చిత్రాలు, వేషధారణ కూడా సింధూ నాగరికత నాటి తమ వంశవృక్షం ఏమిటి ? అనే దాన్ని వృక్షంగా చిత్రలిపి రూపంలో తెలుసుకునేంత గొప్ప పరిజ్ఞానం ఆదివాసీ సమాజంలో ఉంది. ప్రాక్ చరిత్ర నుంచి నేటి వరకు తమకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆదివాసీలు హిందువులు లేదా ఇతర మతాలకు చెందినవారు ఎలా అవుతారు?

దేశంలో ఎన్నో ఏళ్ళుగా నిరాదరణకు గురవుతున్న ఆదివాసీలు తమ సంస్కృతీ సంప్రదాయాలను, తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికీ వారికి సరైన గుర్తింపు ఉందా? ప్రస్తుతం వారి జనాభా ఎంత? వారి మతమేమిటి? అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు.

ఆత్మగౌరవాన్ని కించపరిచేలా

జనాభా గణన ప్రక్రియ గత ఏడాది జరగవలసి ఉంది కానీ, కరోనా వలన సాధ్యపడలేదు. జనాభా గణన ప్రక్రియ మొదలు పెట్టి వచ్చే ఏడాది తాత్కలిక డేటా ఇస్తామని కేంద్రం చెబుతోంది. నిజానికి స్వాతంత్రం వచ్చిన తొలిలో జరిగిన జనగణనలో ఆదివాసీలకు సముచిత గుర్తింపు లభించింది. కానీ, అది ఎక్కువ కాలం కొనసాగలేదు. దేశ జనాభాలో ఆదివాసీల సంఖ్య 12 కోట్లు. వీరి మతమేమిటి? అనేది ఎవరికీ తెలియదు. దీనిపై ఎంతో కాలంగా చర్చ జరుగుతోంది. దీనిపై 2018లో 'ఉస్మానియా'వేదికగా ఇతర రాష్ట్రాల ఆదివాసీ మేధావులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆదివాసీలకు ప్రత్యేక మతం ఉండాలనే డిమాండ్​తో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై ఇప్పటివరకు స్పందన లేదు.

స్వాతంత్రం వచ్చాక తొలి జనాభా గణనలో ఆదివాసీల కోసం మతం కాలమ్ లో 'ట్రైబ్'అనే గుర్తింపు ఉండేది. దీంతో ఆదివాసీలు తమ మతాన్ని 'ట్రైబల్'గా పేర్కొనేవారు. 1961 తరువాత ట్రైబ్ అనే ఆప్షన్ ను తొలగించారు. ఫలితంగా ఆదివాసీలు ఇతర మతాలకు చెందినవారిగా నమోదవుతున్నారు. ఇది తమ ఆత్మగౌరవాన్ని కించపరుస్తోందని వారు వాపోతున్నారు. ఇప్పుడు జరగబోయే గణనలో కూడా కేవలం హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైన, సిక్కులకు మాత్రమే గుర్తింపు ఉంది. వాటిలోనే ఏదో ఒక మతాన్ని ఎంచుకోవాలి ఆదివాసీలు. దీంతో తమ ట్రైబ్ అనే కాలమ్ ను తీసివేసి తమను మత పరమైన బానిసలుగా పరిగణిస్తున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారు సమైక్యమయ్యేందుకు

ఈ దేశంలో ఆదివాసీలు దాదాపు అన్ని మతాలను అనుసరిస్తున్నారు కానీ, వారికి మతం లేదు. మానవీయత, ప్రాకృతిక జీవన విధానమే వారి మతం. వారి విశ్వాసాలు, ఆచారాలు, దేవతారాధన పద్ధతులు చాలా భిన్నమైనవి. అందుకే తమను మతపరంగా ఒక నిర్దిష్ట గుర్తింపు (కోయ పునెం) కోసం ఆదివాసీలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇతర మతాలకు చెందిన వారిగా గుర్తింపు పొందడానికి వారు నిరాకరిస్తున్నారు. ఇటీవల జార్ఖండ్ శాసనసభ వారి రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న శర్జ ఆదివాసీలకు గుర్తింపునివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జార్ఖండ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. దీని కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ కేంద్రానికి లేఖ రాశారు.

ఈ తీర్మానం ఆదివాసీల అస్థిత్వానికి జీవం పోసిందనడంలో సందేహం లేదు. ఇది మతపరంగా జాతీయస్థాయిలో ఒక నిర్దిష్ట గుర్తింపు కోసం ఆదివాసీలు సమైక్యమయ్యేందుకు ఈ తీర్మానం తోడ్పడుతుంది. ఆదివాసీలను దశాబ్దాలుగా ఇతర మతస్థులుగా ఎందుకు పరిగణిస్తున్నారు? వారికి గుర్తింపు లేకుండా ఎందుకు చేశారు? వారి మూలాలు ఏమిటి? అనే దానిపై చర్చ జరగాలి లేకపోతే వారికి సామాజిక హోదా లభించడం అసంభవం అనేది దేశ హితులు గుర్తించవలసిన వాస్తవం.

వారి కట్టుబాట్లను పరిశోధించి

చిత్రాల రూపంలో బండరాయిపై చెట్ల రసంతో ముదురు ఎరుపు రంగు బొమ్మలు వేయడం ఆదివాసీల అలవాటు. అవి ఇప్పుడు ఆదివాసీలు నివసించే దండకారణ్యాలలో, కొండ గుహలలో కానవస్తున్నాయి. అవి ఆదివాసీలు గీసినట్టు పలువురి పరిశోధనలు తెలిపాయి. తమ అస్థిత్వాన్ని చిత్రాల రూపంలో దాచిన తొలి మానవులు ఆదివాసీలే. వీరికి సింధూ నాగరికతకు సంబంధం ఉంది. దానికి సాక్ష్యం నేటి గోండ్వానా ప్రజల జీవన చిత్రాలు, వేషధారణ కూడా సింధూ నాగరికత నాటి తమ వంశవృక్షం ఏమిటి ? అనే దాన్ని వృక్షంగా చిత్రలిపి రూపంలో తెలుసుకునేంత గొప్ప పరిజ్ఞానం ఆదివాసీ సమాజంలో ఉంది.

ప్రాక్ చరిత్ర నుంచి నేటి వరకు తమకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆదివాసీలు హిందువులు లేదా ఇతర మతాలకు చెందినవారు ఎలా అవుతారు? వారి ఆచారాలతో పూజలు పెళ్ళిళ్ళు జరుపుకుంటారు. వీరి కట్టుబాట్లకు హిందూ వివాహ చట్టం వర్తించదు. ఆదివాసీలు హిందువులు కారని గతంలో సుప్రీంకోర్టు వాఖ్యానించింది. వారి నివాసం, ఆచారాలు, నృత్యాలు, పండుగలు అన్నింటిని నిశితంగా పరిశోధించి రాజ్యాంగంలోని ఐదవ, ఆరవ షెడ్యూళ్ళలో పేర్కొన్న ఆదివాసీ తెగలకు మతపరంగా ఒక నిర్దిష్ట గుర్తింపు నివ్వాలి. అలాగే, జనాభా గణన ప్రక్రియలో వారికి ఆ ఆప్షన్ కల్పించాలి. గిరిజన సంస్కృతులను సంరక్షించాలి. ఆదివాసీలను ఆదిమ మతంగా గుర్తించి వారిని తెగల వారీగా గణిస్తేనే వారి జనాభా, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రక్షణ చట్టాలు అమలు చేసే అవకాశం ఉంటుంది.

గుమ్మడి లక్ష్మీనారాయణ

సామాజిక రచయిత

94913 18409


Next Story

Most Viewed