భూములు మింగుతున్న.. బహుళజాతి సంస్థలు!

by Disha edit |
భూములు మింగుతున్న.. బహుళజాతి సంస్థలు!
X

దేశాలు కూడా ముందుముందు ఏర్పడనున్న ఆహార సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దఎత్తున భూ కొనుగోళ్లు చేస్తున్నాయి. ఎక్కువగా ఆఫ్రికా దేశాల రైతుల భూములు పరాయీకరణ చెందుతున్నాయి. ఈ దేశాల్లో భూ హక్కులు కలిగిన రైతులు చాలా తక్కువగా (2 నుండి 10%) ఉండటం, భూమి హక్కుకు ఆ దేశాల్లోని ఆచార వ్యవస్థలు సరిపోతాయని భావించటం, భూములపై విధిగా ప్రభుత్వ యాజమాన్యం కలిగి ఉండటం అందుకు కారణంగా ఉంది. సామ్రాజ్యవాదానికి, బహుళ జాతి సంస్థలకు లొంగిన ప్రభుత్వాలు తమ స్వాధీనంలో ఉన్న భూములను అమ్మటం లేదా లీజుకు ఇవ్వటం ద్వారా భూములు బహుళజాతి సంస్థల పరమౌతున్నాయి. వెనుకబడి ఉన్న వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని, ఆసుపత్రులు, స్కూల్స్ ,రోడ్లు ఏర్పాటు చేస్తామని, పంట ద్వారా లభించే ఆదాయంలో వాటా ఇస్తామని రైతాంగానికి భ్రమలు కల్పించి బహుళజాతి సంస్థలు మోసం చేస్తూ వారి భూములను కబ్జా చేస్తున్నాయి. భవిష్యత్తులో ఆహారం, ఇంధన కొరత సమస్యను దృష్టిలో పెట్టుకుని వాటి వ్యాపారం కోసం పెద్దఎత్తున భూ సేకరణకు పూనుకున్నాయి.

లక్షల ఎకరాల సేకరణ..

2007-2008 ప్రపంచ ఆహార ధరల సంక్షోభం తర్వాత బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున భూ సేకరణను చేపట్టాయి. భూ సేకరణ అనేది దేశ, విదేశీ సంస్థలు, ప్రభుత్వాలు, వ్యక్తులు పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేయటం లేదా లీజుకి తీసుకోవడం. ఈ పద్ధతుల్లోనే లక్షల ఎకరాల భూములను బహుళజాతి సంస్థలు కాజేశాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IFPRI) 2009 అంచనా ప్రకారం అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లో 15 నుండి 20 మిలియన్ల హెక్టార్ల వ్యవసాయ భూములు 2006 నుండి చేతులు మారాయి. 2013 జనవరి నాటికి ల్యాండ్ పోర్టల్‌కి సంబంధించిన ల్యాండ్ మ్యాట్రిక్ డేటా ప్రకారం 49 మిలియన్ హెక్టార్ల భూములకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. 2011 ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 56 మిలియన్ హెక్టార్ల భూమి కోసం విక్రయ ఒప్పందాలు జరిగాయి. సూడాన్ లోని అమెరికా కంపెనీలు ఆర్క్ క్యాప్, నైల్ ట్రేడింగ్ అండ్ డెవలప్ మెంట్ ఇంక్ ఒక మిలియన్ హెక్టార్ల భూమిని తీసుకున్నాయి. చైనా-కొలంబియా మధ్య నాలుగు లక్షల హెక్టార్ల ఒప్పందం జరిగింది. టాంజానియాలో 3,25,000 హెక్టార్లకు బహుళజాతి సంస్థల పెట్టుబడులు ఉన్నాయి. పాకిస్తాన్లో 3,24,000 హెక్టార్ల భూమిని యూఏఈ కొనుగోలు చేసింది.

ప్రభుత్వ ఆధీనంలోని భూములను విదేశీ ప్రభుత్వాలకు, బహుళ జాతి సంస్థలకు ఇచ్చే భూముల లీజు చెల్లింపు ఎంతో హాస్యాస్పదంగా ఉంది. సౌదీ అరేబియా యువరాజు బందర్ బిన్ సుల్తాన్ 1,05,000 హెక్టార్లకు సంవత్సరానికి లీజు రూపంలో చెల్లించేది 1,25,000 అమెరికా డాలర్లు. ఇది హెక్టారుకు ఒక డాలర్ కి కొంచెం ఎక్కువ. పెరూలోని దక్షిణ కొరియా పెట్టుబడిదారులు హెక్టారుకు 0.80 డాలర్ మాత్రమే లీజు చెల్లిస్తున్నారు. ఇథియోపియాలో భారతీయ బడా పెట్టుబడిదారులు కొనే హెక్టారు ధర 3,11,000 కాగా, సంవత్సర లీజు 1.20 నుండి 8 డాలర్లు. టాంజానియాలో 3లక్షల హెక్టార్లలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం 1000 హెక్టార్లలో పని చేస్తున్నాయి. గాబన్‌లో ఓలమ్ ఇంటర్నేషనల్ పెట్టుబడి 3లక్షల హెక్టార్లలో ఉంటే ప్రస్తుతం 59 వేల హెక్టార్లలో పని జరుగుతున్నది. నైజీరియాలో మూడు సంస్థల పెట్టుబడులు 6 లక్షల ఎకరాలు. ఈక్వటోరియల్ పామ్ ఆయిల్ ఒప్పందం 1,69,000 వేల హెక్టార్లు. 2020 నాటికి 50 వేల హెక్టార్లలో పని మొదలు పెట్టాలని ప్రణాళికలు వేసింది.

వారి భూముల్లోనే కూలీలుగా…

యూరోపియన్ యూనియన్ దేశాలు, సైతం అనేక దేశాల్లో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డాయి. ఈయూ ల్యాండ్ మ్యాట్రిక్స్ డేటా 2016 ప్రకారం ఈ దేశాల భూ ఆక్రమణలు ఇతర దేశాల్లో ఇలా ఉన్నాయి. యునైటెడ్ కింగ్ డమ్ 19,72,000 హెక్టార్లు, ఫ్రాన్స్ 6,29,953, ఇటలీ 6,15,674, ఫిన్లాండ్ 5,66,558, పోర్చుగల్ 5,03,953, నెదర్లాండ్స్ 4,14,974, జర్మనీ 3,09,566, బెల్జియం 2,51,808, లక్సెంబర్గ్ 1,57,914, స్పెయిన్ 1,36,504, రొమేనియా 1,30,000, స్వీడన్ 77,329, డెన్మార్క్ 31,460, ఆస్ట్రియా 21,000, ఎస్టోనియా 18,800 హెక్టార్ల భూములు ఆక్రమణ చేశాయి. అనేక దేశాల్లోని ప్రభుత్వ సంస్థలు పెట్టుబడిదారుల ప్రతిపాదనలు అనుమతించరాదని చెప్పినా, ఆ ప్రతిపాదనలను ప్రభుత్వాలు ఆమోదించాయి.

తమ ఆధీనమైన భూముల్లో చెరకు, పామాయిల్, జీవ ఇంధనాలు, తమకు అవసరమైన ఆహార పంటల ఉత్పత్తులకు బహుళజాతి సంస్థలు, విదేశీ బడా పెట్టుబడిదారులు ప్రాధాన్యతగా ఇవ్వటం వలన ఆఫ్రికా దేశాల్లోని సాంప్రదాయ పంటలకు ప్రజలు దూరమయ్యారు. దీనితో పాటు వారి సంస్కృతి మూలాలు ప్రమాదంలో పడుతున్నాయి. బహుళజాతి సంస్థల మోసపు మాటలు నమ్మి భూములు కోల్పోయిన స్థానిక రైతులకు జీవనోపాధి సమస్యగా మారింది. బహుళజాతి సంస్థలు ఇచ్చే పరిహారం వారి జీవనోపాధి పునరుద్దరణకు ఏమాత్రం చాలలేదు. ఉపాధి కల్పనకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. తమ భూముల్లోనే స్థానిక రైతులు కూలీలుగా మారారు. లభించే కూలితో కుటుంబ అవసరాలు తీరక అనేక బాధలు పడ్డారు.

భూములు కోల్పోయి, ఉపాధి కరువై తీవ్ర సంక్షోభంలో ఉన్న అనేక దేశాల్లోని పేదలు, రైతులు పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు. విదేశీ పెట్టుబడిదారుల ఆధీనంలో ఉన్న తమ భూములు తిరిగి ఇవ్వాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, బహుళజాతి సంస్థలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్లకు, ఆందోళనకు భారత ప్రజలు మద్దతు ప్రకటించాలి.

బొల్లిముంత సాంబశివరావు

రైతు కూలీ సంఘం, కార్యవర్గ సభ్యులు

98859 83526

Next Story

Most Viewed