ప్రశ్నించేతత్వంలో కొరవడిన నిబద్ధత

by Disha edit |
ప్రశ్నించేతత్వంలో కొరవడిన నిబద్ధత
X

ప్రజాస్వామ్య దేశంలో పాలకులను, ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు భారతదేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎవరైనా ఎవరినైనా ప్రశ్నించవచ్చు. కానీ ఆ ప్రశ్న సిద్ధాంతాల పునాది కావాలి. కానీ నేడు ప్రశ్నించేతత్వం అంటూ సమాజంలో అసలైన ప్రశ్నలను సంధించకుండా కావాలని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం 60 ఏళ్లుగా ఈ నేల అనేక ప్రశ్నలను సంధించింది. అనేక అక్రమాలపై ప్రశ్నించింది. రాష్ట్ర ఏర్పాటు పోరాటంలో ఆంధ్ర దోపిడీ పెత్తందారుల అన్యాయాలను కళ్ళకు కట్టినట్టు చూపగలిగింది.

ఆ హక్కుతో వ్యక్తిగత విమర్శలు

ప్రస్తుతం రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడిచింది. ఈ కాలంలో తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టి ప్రజల జన జీవన విధానంలో నిత్యం అవసరమయ్యే అనేక పథకాలను ప్రవేశపెడుతుంది. కానీ తెచ్చిన ప్రతీ పథకాన్ని పనిగట్టుకొని ముఖ్యమంత్రిపై, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు. కేసీఆర్ ఉద్యమ సమయంలో తనకు ప్రజల జీవితంలో ఎదురైన కష్టాలను తీర్చాలనే అనేక పథకాలను రూపకల్పన చేశారు. ఆ కోవలోనివే కళ్యాణలక్ష్మి, మిషన్ కాకతీయ, రైతులకు ఉచిత కరెంట్, రైతుభీమా, రైతుబంధు, గురుకులాల ఏర్పాటు వంటి పథకాలు. ఇవి సామాన్యులకు ఎంతో మేలు చేశాయి. దాదాపు 70 ఏళ్ళ పాటు దోపిడీ, అన్యాయాలను ప్రశ్నించే చైతన్యం లేని తెలంగాణ నాయకత్వం వల్ల ఈ ప్రాంతం ఎంతో వెనకబాటుకు గురయ్యింది. ఇప్పుడు ఆ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసింది. స్వయం పాలన, స్వీయ నిర్ణయాలతో ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని అందుకు ఏకైక మార్గం స్వరాష్ట్రం అని అనేక మంది మేధావులు, సబ్బండ వర్గాల సమరంకి తోడు బలమైన రాజకీయ ఒత్తిడితో రాష్ట్ర సాధన సాధ్యమైంది. సాధించిన రాష్ట్రాన్ని రంగులు అద్దినట్టు కాకుండా క్షేత్రస్థాయిలో గుణాత్మక మార్పు తీసుకువస్తున్న క్రమంలో ప్రశ్నించే హక్కు ఉందని వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు.

వ్యక్తిగత ఎదుగుదల కోసం

ఇలా ప్రశ్నించే తత్వం ఉన్నవారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలనే కాదు కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి. అసలు ప్రశ్నించడమంటే వ్యక్తిగత విమర్శ కాదనే సిద్ధాంతం తెలిసి ఉండాలి. రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమంలో అనేక ప్రశ్నలు సంధించారు. కానీ అవి నిజాలతో కూడి, దోపిడీని అందరి కళ్ళకు చూపే విధంగా ఉండేవి. అలా చేస్తే ప్రశ్నించడం అవుతుంది. కానీ అవేం లేకుండా కేవలం వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రశ్నిస్తున్నాం, భావప్రకటన స్వేచ్ఛ అనడం దారుణం. ప్రశ్న ఎప్పుడూ ఆలోచించేదిగా ఉండాలే తప్ప రాజకీయాల్లో ఉన్న వ్యక్తులను కేంద్రంగా చేసుకొని ఆవేశంతో ప్రజల్లో అనవసరమైన ఉద్వేగాలను పెంచేలా ఉండకూడదు. ప్రస్తుత కాలంలో రాజకీయంగా ఎదగడం కోసం వ్యక్తిగత విమర్శలు చేసేవారు ఎక్కువయ్యారు. అటువంటి నిబద్ధత లేని ప్రశ్నించే తత్వానికి విలువ ఉండదు. ప్రశ్నించడం అంటే విజ్ఞత కలిగి ఉండటం. అలా కాకుండా సిద్ధాంతం లేని ప్రశ్నించే గొంతులన్నీ వ్యక్తిగత ఎదుగుదల కోసమే అని స్పష్టంగా అర్థమవుతుంది.

సంపత్ గడ్డం

7893303516

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read....

బీఆర్ఎస్‌లో మంత్రి కేటీఆర్ రోల్ ఏంటి?




Next Story

Most Viewed