గుండెపోటు కేంద్రంగా ఇండియా! తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

by Disha edit |
గుండెపోటు కేంద్రంగా ఇండియా! తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
X

జీవనశైలిలో మార్పులు గుండె జబ్బుల నివారణకు, చికిత్సకు అద్భుతంగా సహాయపడతాయి. బలవర్థక ఆహారాన్ని సక్రమంగా తీసుకోవడం కీలకం. కాలుష్య కారకాలతో జాగ్రత్త వహించండి. ఆహారంలో కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉండే పోషకాలు, ప్రోటీన్, ఫైబర్, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వు రహిత లేదా తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, చేపలు, పౌల్ట్రీ, గింజలు వంటి వాటిపై దృష్టి సారించాలి. డీప్ ఫ్రై చేయడానికి వాడిన నూనెను మరలా వాడొద్దు. వారానికి ఐదు రోజులు 30 నిమిషాలు ఏరోబిక్ యాక్టివిటీ చేయవచ్చు. క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్షలు చేయించుకోండి. ఊబకాయం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. అధిక ఆల్కహాల్ రక్తపోటును పెంచుతుంది. ధూమపానం, పొగాకు వాడకం వెంటనే మానేయడం మంచిది.

రాకెట్ స్పీడ్‌ను మించి దూసుకుపోతున్న ఈ ప్రపంచంలో మనిషి అనేక రకాల శారీరక, మానసిక ఒత్తిడులకు గురవుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబాలను, బంధువులను, బంధుత్వాలను. తిండిని, శారీరక శ్రమను మరచిపోయి అనర్థాలను కల్గించే ఆహారపు అలవాట్లుకు బానిసవుతున్నాడు. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అంటూ చిన్న విషయానికే అతిగా గాబరా పడిపోయి, విపరీతంగా స్పందించడం మొదలు పెట్టాడు. దీంతో శరీరం ఒత్తిడికి గురవుతూ హార్మోన్‌లు, ముఖ్యంగా కార్టిజోన్ స్థాయి పెరిగిపోయి ఆరోగ్యం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

చెడు ఆహారపు అలవాట్లు, సిగరెట్లు, పొగాకు, మద్యం అలవాట్లు, పొద్దుపోయే వరకు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం, గంటల కొద్దీ కదలకుండా కూర్చుని పని చేయడం, వాతావరణ కాలుష్యం, గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటివి గుండెపోటుకు దారి తీస్తున్నాయి. 2030 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా గుండె సంబంధిత మరణాలు నమోదవుతున్న దేశంగా భారత్ నిలుస్తుందని, ప్రతి నాలుగు మరణాలలో ఒకటి 'కార్డియో వాస్కులర్ డిసీజ్' (CVD) కారణంగా సంభవిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై పోరాడటానికి 'వరల్డ్ హార్ట్ ఫెడరేషన్' యేటా సెప్టెంబర్ 29న 'ప్రపంచ హృదయ దినోత్సవాన్ని' జరుపుతుంది. 2022 ను 'ప్రతి హృదయానికి హృదయాన్ని ఉపయోగించండి'. అనే నినాదంతో నిర్వహిస్తున్నారు.

హెచ్చరికలు లేకుండానే

'ఇండియన్ హార్ట్ అసోసియేషన్' ప్రకారం, గుండెపోటు హెచ్చరికలు లేకుండానే తక్కువ వయస్సు గల యువకుల మీదనే మరణాల పంజా విసురుతోంది. పాశ్చాత్య దేశాల కంటే కనీసం పది సంవత్సరాల ముందు భారతీయులు గుండె జబ్బులతో బాధపడుతున్నారు. వయసు పెరిగినపుడు వచ్చే గుండెపోటు కొన్నేళ్లుగా తక్కువ వయస్సులోనే ఎటాక్ చేస్తోంది. ఇలా ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలామంది సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ఇది యువ భారత్‌కు ఏ మాత్రం మంచిది కాదని వైద్య రంగ నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు.

ఇటీవలి శాస్త్రీయ ఆధారాలు భయంకర ఫలితాలను వెల్లడించాయి. భారతీయులలో CAD (కరోనరీ ఆర్టరీ డిసీస్) రెట్లు ఇతర జాతుల కంటే 50-400 శాతం ఎక్కువ. గత మూడు దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలలో సీఏడీ ప్రాబల్యం సగానికి తగ్గింది, భారతదేశంలో మాత్రం చాలా రెట్లు పెరుగుతున్నది. మొదటి గుండెపోటు సంభవించే సగటు వయస్సు భారతీయులలో 20 సంవత్సరాలు తగ్గింది. భారతీయ పురుషులలో మొదటి గుండెపోటు 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో 50 శాతం, 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో 25 శాతం మందిలో సంభవిస్తుంది.

చైనా, జపాన్‌లో తక్కువ ..

'హోమోసిస్టీన్' అణువు భారతీయులలో సీఏడీకి స్వతంత్ర ప్రమాద కారకంగా గుర్తించబడింది, ఇది శ్వేతజాతీయుల కంటే మన జనాభాలోనే ఎక్కువగా ఉంది. అపోలిపో ప్రొటీన్ B, ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ ఇన్హిబిటర్, ఫైబ్రినోజెన్, సి-రియాక్టివ్ ప్రోటీన్ వంటి ఇతర ఉద్భవిస్తున్న బయోకెమికల్ ప్రమాద కారకాలు ఇతర జాతుల కంటే భారతీయులలో అధిక స్థాయిలో కనుగొనబడ్డాయి. 74 వాతం ధూమపానం అలవాటు ఉన్నప్పటికీ, USA కంటే జపాన్ ఐదు రెట్లు తక్కువ CAD రేటును కలిగి ఉంది. కానీ, జపాన్ తన CAD రేటును 60 శాతానికి తగ్గించింది.

అధిక స్థాయి HDL మంచి కొలెస్టరాల్ వాడకం, అధిక చేపల వినియోగంతో దారిలోకి తెచ్చుకుంది. చైనాలో ధూమపానం, అధిక రక్తపోటు కేసులు ఎక్కువైనప్పటికీ CAD మరణాల రేటు చాలా తక్కువ. కారణం ఇక్కడ వారిలో అనుకూల లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువగా ఉండటమే. 'ప్రాణాంతక' కొలెస్ట్రాల్ కొరోనరీ ధమనులలో కొలెస్ట్రాల్ ఫలకం, క్లాట్ ఏర్పడటానికి శక్తివంతమైన కారకం, ఆశ్చర్యకరంగా ఈ మార్కర్ స్థాయిలు చైనీస్‌ల కంటే భారతీయ నవజాత శిశువులలో ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది.

గుండెపోటు లక్షణాలు

ఒత్తిడి జీవితంలో సాధారణం. కానీ, అది స్థిరంగా ఉంటే హాని కలిగించవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి బ్లడ్ షుగర్, రక్తపోటును పెంచుతుంది. ఇవి గుండె జబ్బులకు సాధారణ ప్రమాద కారకాలు. ఈ ఒత్తిడి కూడా ధమనులలో ఫలకం నిక్షేపాల నిర్మాణాన్ని ప్రోత్సహించే మార్పులకు కారణమవుతుంది. గుండెకు సరఫరా అయ్యే రక్త ప్రసరణలో ఇబ్బంది ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంటుంది. ఇది సహజంగా రక్త నాళికలలో పేరుకున్న కొవ్వు, ఇతరత్రా వాటితో జరుగుతుంది.

గుండె పోటు వచ్చినప్పుడు ఛాతీలో తీవ్ర నొప్పి రావడం, చెమటలు పట్టడం, శ్వాసలో ఇబ్బంది, వాంతులు, గొంతెండి పోవడం, తల తిరగడం, హఠాత్తుగా అలసట వంటివి ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఛాతీ మధ్యలో కొన్ని నిమిషాలపాటు తీవ్ర నొప్పి, ఛాతీ భారంగా లేదా పట్టేసినట్టుండటం, గుండె నుంచి భుజాలు, మెడ, చేతులు, జబ్బలలో భరించలేని నొప్పి రావడం గుండెపోటు లక్షణాలే.

ఒత్తిడిని తగ్గించే మార్గాలు

ఒత్తిడిని తగ్గించడానికి చేయగలిగినంతా చేయండి. చేయలేని దానిని మార్చండి. నియంత్రించలేని కొన్ని విషయాలు ఉన్నాయని అంగీకరించండి. ఒత్తిడి కలిగించే అభ్యర్థనలకు 'నో' చెప్పడం నామోషీ కాదు. సుమా! ఇష్టపడే వ్యక్తులతో సన్నిహితంగా ఉండండి. రోజూ విశ్రాంతి తీసుకోవడాన్ని ఒక పాయింట్‌గా చేసుకోండి. ఒక పుస్తకాన్ని చదవవచ్చు, సంగీతం వినవచ్చు, ధ్యానం చేయవచ్చు, ప్రార్థన చేయవచ్చు, యోగా లేదా మెడిటేషన్ చేయండి, లేదా ఇష్టమైన జర్నల్ చదవండి, చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యాయామం చేయడం వలన ఒత్తిడిని తగ్గించుకుంటారు. మంచివారితో స్నేహం చేయండి, అభిప్రాయాలు, ఆలోచనలు. మంచి, చెడులు పంచుకోండి.

నివారణకు చిట్కాలు :

జీవనశైలిలో మార్పులు గుండె జబ్బుల నివారణకు, చికిత్సకు అద్భుతంగా సహాయపడతాయి. బలవర్థక ఆహారాన్ని సక్రమంగా తీసుకోవడం కీలకం. కాలుష్య కారకాలతో జాగ్రత్త వహించండి. ఆహారంలో కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉండే పోషకాలు, ప్రోటీన్, ఫైబర్, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వు రహిత లేదా తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, చేపలు, పౌల్ట్రీ, గింజలు వంటి వాటిపై దృష్టి సారించాలి. డీప్ ఫ్రై చేయడానికి వాడిన నూనెను మరలా వాడొద్దు. వారానికి ఐదు రోజులు 30 నిమిషాలు ఏరోబిక్ యాక్టివిటీ చేయవచ్చు. క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్షలు చేయించుకోండి.

ఊబకాయం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. అధిక ఆల్కహాల్ రక్తపోటును పెంచుతుంది. ధూమపానం, పొగాకు వాడకం వెంటనే మానేయడం మంచిది. మధుమేహం కలిగి ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. క్రమం తప్పకుండా చక్కెర స్థాయిలను పరీక్షించండి. ముఖ్యంగా కరోనా నుంచీ కోలుకున్నవారు ఒత్తిడికి లోను కాకుండా చూసుకోవాలి. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఏ జబ్బు కైనా మందులు వాడటం మంచిది. సొంతంగా స్టెరాయిడ్స్ మందులు వాడటం అత్యంత ప్రమాదకరం. (నేడు ప్రపంచ హృదయ దినోత్సవం)


డా. బి. కేశవులు. ఎండీ

సైకియాట్రీ. సీనియర్ మానసిక వైద్య నిపుణులు

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

జాతీయ యాంటీ డ్రగ్స్ సంస్థ.

99496 95189


Next Story