వ్యవసాయంలో.. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​!

by Disha edit |
వ్యవసాయంలో.. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​!
X

భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిది. ఇంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగం నేడు సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయ రంగంలో మొదట నాగలి పోయి ట్రాక్టర్ వచ్చినప్పుడు యంత్రాలు సాగుచేస్తాయా అన్నవాళ్లున్నారు. తర్వాత్తర్వాత ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో రైతులు ఈ పద్ధతులకూ అలవాటు పడ్డారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు..

ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం రంగం పుంజుకున్నది. కానీ తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్న కాలం వచ్చేసింది. ఇలాంటి సమయంలో కృత్రిమ మేధ సాంకేతికత (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తెరపైకి వచ్చింది. వ్యవసాయ రంగంపైనా ఇది ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే వ్యవసాయరంగంలో కొన్ని కృత్రిమ మేధ సాంకేతికత ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల రైతులకు ఏం మేలు జరగనుంది? వ్యవసాయ రంగానికి అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది.

మనదేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50 శాతం పైనే ఆధారపడి ఉన్నది. కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని విస్తృత పరచి రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉండాలని తలచి వ్యవసాయ రంగానికి అనేక పథకాలు పెట్టి తద్వారా లాభాలు చేకూరుస్తున్నప్పటికీ నేటి పరిస్థితుల్లో వ్యవసాయం అంత లాభసాటిగా ఉండడం లేదు. దీనివల్లనే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది. అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్ జీపీటీ’ ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి.

ఉత్పాదకత పెంచేందుకు..

మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజూర్ ఓపెన్ ఏఐ సర్వీస్ ద్వారా చాట్ జీపీటీ ఆధారంగా తయారైన‘ జుగల్ బందీ‘ చాట్ బొట్ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్ వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్ బోట్ ఇంగ్లీషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ రైతులకు అందిస్తుండటం విశేషం. చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడం కోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు.

వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వేసిన పంట ఎంత బాగా పండుతుంది అని కచ్చితంగా చెప్పగలదు. దీన్నే అంచనా విశ్లేషణ (ప్రిడిక్టివ్ అనాలసిస్) అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి.

పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది.

ఖర్చు తగ్గి, దిగుబడి పెరుగుతుంది!

జనరేటివ్ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే అతితక్కువ కలుపు నాశనిలతో వాటిని తొలగించే ప్లాన్‌ను ఏఐ అందివ్వగలదు. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రెసిషన్ అగ్రికల్చర్ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణిస్తూ చేసే ప్రెసిషన్ అగ్రికల్చర్ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి.

వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కృత్రిమ మేధ సాంకేతికత వేగంగా గుర్తించగలదు. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఏఐ (కిసాన్ జీపీటీ)’ ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేలమంది రైతులు కిసాన్ ఏఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్ దేశాయ్ తెలిపారు.

ఇప్పటికే వినియోగిస్తున్న రాష్ట్రాలు..

డిజిటల్ గ్రీన్ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్ ఏఐ’ ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభై కి పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్ బోట్ ద్వారా అందిస్తోంది. ‘మిర్చి, పసుపు’ పరికరాలు మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్ ఇస్తున్నారు.

మరో మూలమలుపు కృత్రిమమేధ

నిప్పు ... విద్యుత్తు... ఎలాగైతే మానవజాతి అభివృద్ధిని కీలక మలుపులు తిప్పాయో అలాగే కృత్రిమమేధ కూడా అంతటి ప్రాముఖ్యత కలిగినదని అంటారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. మనిషీ, యంత్రమూ చేయీ చేయీ కలిపి ఆడుతూ పాడుతూ పని చేసే రోజులు వచ్చేశాయంటారాయన. కృత్రిమమేధ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు... మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి కాబట్టి వాటికి ఆ పనులు అప్పజెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో... సృజనాత్మకత, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. అంటే, ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకి కుడిభుజంగా మారనుందన్న మాట! ఏదేమైనా, ఈ కృత్రిమ మేధ సాంకేతికత (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పద్దతి ద్వారా అయినా మన దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు వ్యవసాయం లాభసాటిగా జరగాలని, వ్యవసాయంలో నష్టం వచ్చిందనే కారణంతో రైతులు వేలాదిగా ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఆశిద్దాం. రైతు కుటుంబాలు మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం.

ఎన్.సీతారామయ్య

94409 72048

Next Story