ఈ ఆలయంలో దేవుడు మునివేళ్లపై నిలుచుని భక్తుల కోసం ఎదురు చూస్తుంటాడు..

by Disha Web Desk 20 |
ఈ ఆలయంలో దేవుడు మునివేళ్లపై నిలుచుని భక్తుల కోసం ఎదురు చూస్తుంటాడు..
X

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశం అంటేనే ఆధ్యాత్మికతకు, హిందూ సాంప్రదాయాలకు నెలవు. అలాంటి భారత దేశంలో ఏండ్ల చరిత్ర కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అద్భుత శిల్పకలలు, కనీవిని ఎరుగని సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయాలను పూర్వం నిర్మించేవారు. అలాంటి అతి పురాతనమైన ఆలయాల్లో పంచభావన్నారాయణ స్వామి క్షేత్రాలు కూడా ఉన్నాయి.

ఈ ఆలయాలు సుమారు 1,500 ఏళ్ల క్రితం నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. పంచభావనారాయణస్వామి ఆలయాలు మొత్తం ఐదు ఉన్నాయి. ఈ ఐదు క్షేత్రాలు బాపట్ల (భావపురి), పొన్నూరు (స్వర్ణపురి), భావదేవరపల్లి (కృష్ణా జిల్లా), సర్పవరం ( కాకినాడ), పట్టిసీమలో ఉన్నాయి. ఈ పంచభావన్నారాయణస్వామి ఆలయాల్లో బాపట్లలో వెలసిన భావనారాయణస్వామి ఆలయం ఒకటి. ప్రస్తుతం ఈ ఆలయం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.



ఈ ఆలయం వేసవి కాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. ఇది అప్పటి ఇంజనీర్ల అద్భుతమైన ప్రతిభ అని చెప్పొచ్చు. అంతే కాదు ఈ ఆలయంలోని స్వామి వారి విగ్రహం మునివేళ్ల పై నిలబడి తనని దర్శించడానికి వచ్చే భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంటుంది. అలా భక్తుల కోసం ఎదురుచూస్తున్న ఆ స్వామి వారి ముందు నిలబడి భక్తులు ఏం కోరుకున్నా అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం.

ఈ ఆలయానికి రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయి. ఆలయ స్తంభాలు గజపాద ఆకారంలో ఉండటం విశేషం. ఆలయంలో గర్భగుడి వెనుక పైకప్పు పై చేప ఆకారం కనిపిస్తుంది. దాన్ని తాకితే శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. మరి ఇన్ని విషిష్టతలు కలిగిన ఆ ఆలయం ఏది..ఎక్కడ ఉంటుంది పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.



భావన్నారాయణస్వామి దేవాలయం బాపట్ల పట్టణంలో ఉంది. ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణస్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలక్రమేన ఆ పేరు భావపట్లగా, బాపట్లగా మారింది. ఈ భావనారాయణస్వామి ఆలయం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతే దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాచీన వైష్ణవ క్షేత్రం. ఈ ఆలయాన్ని పూర్వం చోళులు నిర్మించారు. శైవానికి పంచారామక్షేత్రాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే వైష్ణవానికి కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయి.

ఈ ఆలయంలో భావన్నారాయణస్వామి, శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవార్లు, ఆళ్వారులు కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రధాన దైవం క్షీర భావనారాయణస్వామి తన భార్య సుందరవల్లితో కలిసి కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలోని ప్రతి రాతిపైన స్థలపురాణం, ఆలయచరిత్ర చెక్కబడి ఉన్నాయి. ప్రతి సంవత్సరం వేసవికాలంలో వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు వచ్చిచేరతారు. అయితే ఎంతో పురాతన మైన ఈ ఆలయం చాలాకాలంగా మరమ్మతులు లేక 2011 అక్టోబరు 23 న ఆలయ గాలి గోపురం కుప్పకూలింది. కాగా ఇటీవలే గాలి గోపురం పుణ: నిర్మాణం చేశారు.




Next Story