విద్యా సంస్థలకు నిబంధనలు.. ఆ రెండు శాఖలకు కీలక ఆదేశాలు

by  |
Physical classes in schools
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతుండటంతో ప్రభుత్వం వైరస్ వ్యాప్తి జరగకుండా తగిన చర్యలు చేపట్టింది. తరగతి గదుల్లో చేపట్టాల్సిన కొవిడ్ నిబంధనలను ఖరారు చేసి విద్యాశాఖ, పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందుస్తు జాగ్రత్తలపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పలు సూచనలు వెలువరించింది. పాఠశాలలో పారిశుధ్య పనులు పూర్తిగా పంచాయతీలు, మున్సిపాలిటీలదేనని స్పష్టం చేశారు. విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని కొవిడ్ నిబంధనలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

పాఠశాలలో కొవిడ్ ప్రోటోకాల్‌‌ను తప్పనిసరిగా పాటించేలా కార్యక్రమాలు చేపట్టే బాధ్యతలను పూర్తిగా ప్రధానోపాధ్యాయుడికే అప్పగించారు. పాఠశాల, హాస్టల్‌, వంట గది, భోజన గదులు, ప్రయాణ ప్రదేశాల్లో నిబంధనలు పాటించాలి. విద్యార్థులు, విద్యాసంస్థల సిబ్బంది విధిగా మాస్క్ ధరించాలి. తరగతి గదిలో ఎవరైనా విద్యార్థికి జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి కొవిడ్ పరీక్షలు చేయించాల్సిన బాధ్యతలను ప్రధానోపాధ్యాయుడు స్వీకరించాలి. విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇంటికి పంపించాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్ లేదా హాస్టల్‌లో, కొవిడ్ పాజిటివ్ కేసులు పెరిగితే వెంటనే డీఈఓలకు, కలెక్టర్లకు సమాచారం అందించాలి. సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో, గురుకులలో, కేజీబీవీలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. భౌతిక దూరం పాటించేలా క్లాసు రూముల్లో సీటింగ్ ప్లాన్‌ను సిద్ధం చేయాలి.

మధ్యాహ్న భోజనంలో జాగ్రత్తలు..

మధ్యాహ్న భోజనం, వంట కోసం ఉపయోగించే బియ్యం, ఇతర వస్తువుల నాణ్యతను హెడ్ మాస్టర్ విధిగా పరిశీలించాలి. పరిశుభ్రత, భౌతిక దూరాన్ని పాటించేలా వంటగది, భోజన ప్రదేశాలలో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలి. భోజన సమయంలో విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం, భోజన చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు చేపట్టాలి.

పారిశుధ్య బాధ్యతలు పంచాయతీలదే..

పాఠశాలలో పారిశుధ్య బాధ్యతలు పూర్తిగా పంచాయతీలదేనని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టం చేసింది. అంగన్‌వాడీ, పాఠశాల, హాస్టళ్లలో శానిటేషన్‌ను పంచాయతీ పారిశుధ్య కార్మికులు చేపట్టాలి. పాఠశాల ఆవరణలో మురుగు నీరు, చెత్తా చెదారం నిలువకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా పూర్తిగా శుభ్రం చేయాలి. వాటర్ ట్యాంక్‌లను శుభ్ర పరిచి నీటి వసతి కల్పించాలి. బ్లీచింగ్ పౌడర్లను, సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాలను చల్లి పరిశుభ్రతను నెలకొల్పాలి. ఈ పనులన్నింటినీ స్థానిక జడ్పీ చైర్మన్లు(చైర్ పర్సన్లు), జడ్పీ సీఈఓలు, ఎంపీపీలు, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టి విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలి. ఈ పనులన్నింటిని కూడా గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఖర్చు చేయాలి.

Next Story

Most Viewed