మాయదారి రోగం.. మా కొంప ముంచింది

by  |
మాయదారి రోగం.. మా కొంప ముంచింది
X

దిశ,‌ న్యూస్‌బ్యూరో: ‘పొద్దంత కష్టపడి పనిచేస్తేగానీ పూటగడువని స్థితిలో గీ మాయదారి కరోనా వైరస్ వచ్చి మా బతుకులను ఆగం చేసింది. చిన్నా, చితక వ్యాపారాలు నడుపుకుంట బతుకుబండి లాగిస్తున్న మాపై కరోనా వైరస్ మట్టికొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ చేయడంతో రెక్కాడితేగాని డొక్కాడని మా కుటుంబాల జీవనం అగమ్యగోచరంగా మారింది. తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్నం. వడ్డీ వ్యాపారుల వద్ద తెచ్చిన అప్పులు తీర్చలేక తిట్లు తింటున్నాం. ఇంటి అద్దెలు చెల్లించలేకపోవడంతో యాజమానులు ఇంటి నుంచి గెంటేస్తమంటున్నారు. ఎక్కడ ఉండాలో.. ఎట్లా బతుకాలో అర్థం కావడం లేదు. మాయదారి రోగం మా ప్రాణం మీదికి వచ్చినట్టుంది. సర్కారైన మా బతుకులను అర్థం చేసుకొని భరోసానివ్వాలి’’ అని హైదరాబాద్‌లోని చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర నలుమూలల నుంచి పొట్టచేత పట్టుకొని హైదరాబాద్‌కు వచ్చిన ప్రజలు ఇక్కడా చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృభిస్తుండడంతో ప్రభుత్వం నియంత్రణలో భాగం ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరువ్యాపారుల జీవన స్థితిగతులు అగమ్యగోచరంగా మారాయి. పొద్దంతా పనిచేస్తేగాని రాత్రికి పూటగడవని దినసరి కూలీలు, ఆటోడ్రైవర్లు, టీ, టిఫిన్ సెంటర్లు నడిపించే చిరువ్యాపారుల బతుకులు రోడ్డున పడ్డాయి. లాక్‌డౌన్ పేరుతో టీ సెంటర్, టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకొని జీవనం సాగించే వ్యాపారులకు పని లేకుండాపోయింది. ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవడంతో రోడ్లపై ఎలాంటి వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. దీంతో ఆటోడ్రైవర్ల దుస్థితి వర్ణణాతీతం. ఇప్పటి వరకు చాలామంది డ్రైవర్లు రోజుకు రూ.250 అద్దెకు ఆటోలు తీసుకొని నడిపించుకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. మూడు రోజుల నుంచి ఆటోలు రోడ్లపై నడపడానికి వీలులేక పోవడంతో ఆటో అద్దె చెల్లించలేని పరిస్థితి వచ్చిందంటూ ఆందోళన చెందుతున్నారు ఆటోడ్రైవర్లు. సాధారణ రోజుల్లో పొద్దంతా నడిపిస్తేనే కూలీగిట్టని పరిస్థితి ఉంటుంది. ఇక ఇప్పుడు మొత్తానికే నడవకపోతే బతికేదెట్లా! అని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు టీ సెంటర్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌తో వీరి కుటుంబ జీవనం దీనస్థితికి చేరుకుంది. టీ సెంటర్లు నడిస్తేగాని జీవనం సాగని కుటుంబాలకు భరోసా లేకుండా పోయింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్ బియ్యం కూడా వీరికి అందే అవకాశం లేదు. లాక్‌డౌన్ షరతులు ఎప్పటి వరకు ఉంటాయో.. తాము ఎన్ని రోజులు పస్తులు ఉండాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

టీ అమ్మితేనే రాత్రికి బువ్వ: భూమయ్య కరీంనగర్

మూడేండ్ల నుంచి టీ అమ్ముకొని జీవనం సాగిస్తున్న. రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు ఆదాయం వచ్చేది. అన్నీ పోను రూ.300 కూలీ గిట్టుబాటు అయ్యేది. కరోనా వైరస్ వచ్చిందన్న నాటి నుంచి గిరాకీ దెబ్బతిన్నది. ఎవరు కూడా టీకి వస్తలేరు. అందరూ భయపడుతున్నారు. రోజూ వచ్చేవారు కూడా ముఖంచాటేశారు. మూడు రోజుల నుంచి 10 ఛాయ్‌లు కూడా అమ్ముడు పోలేదు. మా వ్యాపారం ఏ రోజుకారోజు అన్నట్లే ఉన్నది. టీ అమ్మితేనే మాకు బుక్కేడు బువ్వ, లేకుంటే పస్తులే.

ఆటో అద్దె చెల్లించ లేకపోతున్న: లోకేష్, మహబూబ్‌నగర్

ఆరేండ్ల నుంచి అద్దె ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నా. సాధారణ రోజుల్లో పొద్దంతా ఆటో నడిపిస్తే రూ.700 వరకు ఆదాయం వస్తుంది. అద్దె రూ.250, డీజిల్ రూ.200 పోను రోజుకు రూ.350 వరకు కూలీ గిట్టేది. లాక్‌డౌన్ పేరుతో రోడ్లపై ఎలాంటి వాహనాలు తిరగనివ్వకపోవడంతో మూడు రోజులుగా ఆటో నడవడం లేదు. ఎప్పుడో ఒకటి చిన్న చిన్న గిరాకీలు వచ్చినా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆటో అద్దె చెల్లించ లేక.. కుటుంబాన్ని సాకలేక నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. పరిస్థితి ఇలానే ఉంటే బతికేదెట్లో అర్థం కావడం లేదు.

కుటుంబ భారం నాపైనే : పండ్ల వ్యాపారి మహేష్, వికారాబాద్

నేను వీధి వీధి తిరిగి పండ్లు అమ్మితేనే నా కుటుంబ జీవనం గడుస్తుంది. కరోనా వైరస్ భయంతో ఎవరూ పండ్లు కొనడం లేదు. వీధుల్లో తిరగనివ్వడం లేదు. రోడ్ల మీద ఎక్కడైనా నిలబడితే పోలీసులు వెళ్లగొడుతున్నారు. తెచ్చిన పండ్లు అమ్ముడు పోవడం లేదు. పొద్దంతా తిరిగినా రూ.300 కూడా వస్తలేవు. ఇల్లు గడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం మా బాధలు అర్థం చేసుకొని సాయం చేయాలి.

Tags: corona effect on tea stall, street vendor, auto drivers, hyderabad


Next Story

Most Viewed