ప్రతి పాఠశాలలో పకడ్బందీ ఏర్పాట్లు.. కమిటీల పర్యవేక్షణ

by  |
schools opening
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన పిల్లల్ని యేడాదిన్నర తర్వాత స్కూల్‌కు పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. కానీ వారిని కరోనా భయం వెంటాడుతూనే ఉంది. వారిలో ఉన్న అనుమానాన్ని పోగొట్టి పిల్లల్ని బడికి పంపించే విధంగా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా పనులు మొదలుపెట్టింది. బడులు తెరిచేందుకు కేవలం ఆరు రోజులే సమయం ఉండటంతో రోజువారిగా చేయాల్సిన పనులను గుర్తిస్తున్నారు. ఈ నెల 30 వరకు పాఠశాలలను సిద్ధం చేసి పిల్లలు తరగతులకు హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. విద్యార్థికి ఎలాంటి కరోనా లక్షణాలున్నా పరీక్షలు చేయించే విధంగా వైద్యశాఖకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

విద్యార్థుల సంరక్షణే ధ్యేయంగా పాఠశాలల్లో శానిటైజేషన్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో ఉండే పాఠశాలల్లో రోజూ శానిటైజేషన్ చేపించే బాధ్యతను సర్పంచ్, మున్సిపల్ చైర్మన్లకు అప్పగించారు. అయితే దానికంటే ముందే సరైన సదుపాయాలు లేకుండా ఉన్న స్కూళ్లు, కాలేజీలు, అంగన్ వాడీలు, హాస్టళ్లల పరిసరాలను శుభ్రపరిచి పిల్లలకు కావాల్సిన పూర్తి ఫర్నీచర్, మంచి నీరు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లతో ఆవరణలో బ్లీచింగ్ చేయాలని గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ప్రతి పాఠశాలలో తరగతులను శుభ్రపరిచేందుకు ఉండే ఆయాలను తొలగించారు. ప్రస్తుతం క్లాసుల క్లీనింగ్, శానిటేషన్ చేయించాలని ప్రధానోపాధ్యాయులు సర్పంచ్‌లకు విన్నవిస్తున్నారు.

రాష్ట్రంలోని పాఠశాల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది. కలెక్టర్ చైర్మన్‌గా 16 మందితో జిల్లా స్థాయి కమిటీని, ఎంపీపీ చైర్మన్‌గా 14 మందితో మండల స్థాయి కమిటీ, సర్పంచ్ చైర్మన్‌గా 11 మందితో గ్రామస్థాయి కమిటీలు నియమించబడ్డాయి. అన్ని జిల్లాలో ఇలాంటి కమిటీలుండగా కొన్ని చోట్ల మరింత మంది అధికారులను యాడ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కమిటీలు రంగంలోకి దిగాయి. జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల శానిటేషన్, క్లీనింగ్, నీటి సదుపాయాలు, టాయిలెట్స్ మెయింటనెన్స్‌ను చేసే విధంగా జిల్లా పంచాయతీ రాజ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు మానిటరింగ్ చేయనున్నారు.

అంతేకాకుండా చేతులు శుభ్రపరిచేందుకు తప్పనిసరిగా హ్యండ్ వాష్ లు, టెంపరేచర్ చెక్ చేసేందుకు థర్మామీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు స్కూళ్లలో రోజుకు రెండు సార్లు శానిటైజ్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ఎలాంటి సమస్య తలెత్తినా, హెల్త్ ఇష్యూ వచ్చినా ప్రధానోపాధ్యాయులు మానిటరింగ్ చేసి వెంటనే డీఈవోలకు తెలియపరచాలని ప్రైవేటు విద్యాసంస్థలకు సూచించారు. కాగా, జిల్లాల్లోని స్కూళ్ల పనితీరు, మార్గదర్శకాల అమలుపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మానిటరింగ్ చేయనున్నారు.

స్కూళ్లలోని తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని జిల్లా కమిటీ సూచించింది. దీనితో పాటు విద్యార్థులు పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా వచ్చే వారిపై మరింత దృష్టి పెట్టి వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

ఒకవేళ విద్యార్థులు కరోనా బారిన పడితే వారి కాంటాక్టులను, తల్లిదండ్రులను అప్రమత్తం చేసి, టెస్టులు చేసే విధంగా జిల్లా వైద్యాధికారితో సమన్వయంగా పనిచేయనున్నారు. దీనితో పాటు మండల స్థాయిలో ఉన్న కమిటీలు ప్రతివారం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోనున్నారు. మండలంలో ఉన్న అన్ని పాఠశాలల్లో పర్యటించి స్కూళ్లలో శానిటైజేషన్ జరుగుతుందో లేదో చెక్ చేస్తారు. వీటన్నింటినీ ఎంపీవో స్వయంగా పరిశీలించనున్నారు. ఈ నెల 28లోపు అన్ని పనులు పూర్తి చేయించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్కూళ్లు ఏర్పాట్లు చేశాయో లేదో పర్యటించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనితో పాటు గ్రామ కమిటీ కూడా గ్రామపంచాయతీ పరిధిలోని స్కూళ్లు, హాస్టళ్లను నిత్యం మానిటరింగ్ చేయనున్నారు.

Next Story

Most Viewed