అంగన్‌వాడీ‌ కేంద్రాల్లో నిర్లక్ష్యం.. పౌష్టికాహారంలో పురుగులు

by  |
అంగన్‌వాడీ‌ కేంద్రాల్లో నిర్లక్ష్యం.. పౌష్టికాహారంలో పురుగులు
X

దిశ, పాల్వంచ: అంగన్‌వాడీ కేంద్రాల నిర్లక్ష్యపు నిర్వాకం మరోసారి బట్టబయలైంది. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ ముందంజలో నిలిచింది. ఈ పథకంలో భాగంగా చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడమే ధ్యేయంగా ఈ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కానీ, అంగన్‌వాడీ నిర్వాహకుల తీరు మాత్రం కుక్క తోక వంకర అన్న చందంగానే తయారైంది. పాల్వంచ మండల పరిధి జగన్నాధపురం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పప్పు కూరలలో పురుగులు దర్శనమిస్తున్నాయి.

బుధవారం మధ్యాహ్నం భోజన సమయంలో గర్భిణీ స్త్రీలు ఈ పురుగులను చూసి ఖంగు తిన్నారు. విద్యార్థులు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్‌వాడీ నిర్వాహకులు తమ స్వలాభం కోసం నాణ్యత లేని పప్పు, కూరగాయలతో వంటలు వండి విద్యార్థులకు గర్భిణీ స్త్రీలకు అదే పౌష్టికాహారం అన్నట్లు వారికి అందిస్తున్నారు. వీటిపై పర్యవేక్షణ చేయవలసిన ఉన్నత స్థాయి అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నట్లు స్థానికులు, గర్భిణీ స్త్రీలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ.. రానున్న రోజుల్లో నైనా పురుగులు లేని పౌష్టికాహారం అందించాలని స్థానికులు వేడుకుంటున్నారు.


Next Story