గంజాయి, రౌడీయిజం, దౌర్జన్యాలపై గళమెత్తిన "పులివర్తి నాని"

by Disha Web Desk 18 |
గంజాయి, రౌడీయిజం, దౌర్జన్యాలపై గళమెత్తిన పులివర్తి నాని
X

దిశ, చంద్రగిరి:చంద్రగిరిలో గంజాయి, రౌడీయిజం, దౌర్జన్యాలపై టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గళమెత్తారు. యువత, ఆడబిడ్డల భవిష్యత్తు కోసం జెండాలు జతకట్టాయి. మార్పు కోసం నినాదాలు నింగినంటాయి. మంగళవారం పులివర్తి నాని ఆధ్వర్యంలో టవర్ క్లాక్ నుంచి నూర్ జంక్షన్ వరకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. గంజాయి భూతాన్ని తరిమేద్దాం.. చంద్రగిరి అభివృద్ధికి దోహదపడుదాం. రౌడీ రాజ్యం నశించాలి. శాంతిభద్రతలు పరిరక్షించాలని నినాదాలు హోరెత్తాయి.

ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ ముందెన్నడూ లేని విధంగా డ్రగ్స్ మాఫియాతో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రాణాంతకమైన డ్రగ్స్ గంజాయి, సారా వంటి మత్తులో యువకులు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుకు బానిసైన యువత, విద్యార్థులు బాలికల కళాశాల, ఉన్నత పాఠశాలల వద్ద బైకులపై చక్కర్లు కొడుతూ విద్యార్థులను ఈవ్ టీజింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చంద్రగిరి నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యం నుంచి కాపాడాలని, శాంతిభద్రతలు పరిరక్షించాలని పులివర్తి నాని కోరారు. ప్రశ్నిస్తే దాడులు, గొంతెత్తితే అణిచివేతలు, మాట వినకుంటే అక్రమ కేసులతో అధికార పార్టీ అరాచకాలు సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story