మెడికల్ సీట్లు అమ్ముకున్న ముఖ్యమంత్రి జగన్!:నారా లోకేష్

by Disha Web Desk 18 |
మెడికల్ సీట్లు అమ్ముకున్న ముఖ్యమంత్రి జగన్!:నారా లోకేష్
X

దిశ,మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ సీట్లను కూడా వదల్లేదు. కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లు అమ్ముకున్నారని యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కొండపనేని టౌన్ షిప్ వాసులతో యువనేత మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ తీసుకొచ్చిన మెడికల్ సీట్లు అమ్ముకునే విధానానికి స్వస్తి పలికి, ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెస్తాం. జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. ఆరోగ్యశ్రీ కింద రూ.1200 కోట్ల బకాయిలు పెట్టడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడా ఈ పథకం కింద వైద్యం అందించడం లేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేసి పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తాం. రాష్ట్రంలో మరోసారి జగన్ కు అధికారమిస్తే అంధకారం రాజ్యమేలుతుంది. ఏడాదికి రెండు మూడు సార్లు విద్యుత్ ఛార్జీలతో బాదేశారు. గత అయిదేళ్లలో 9 సార్లు చార్జీలు పెంచినా ఎడాపెడా కరెంటు కోతలే.

నిరంతర విద్యుత్ అందించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు సోలార్ పవర్ సంస్థలతో యూనిట్ 2.45 కి ఒప్పందం కుదుర్చుకుంటే వాటిని రద్దు చేసిన జగన్ ఓపెన్ మార్కెట్లో రూ.10కి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల వినియోగదారులపై మోయలేని భారం పడుతోంది. గతంలో వందల్లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు వేలల్లో వస్తుంది. పొరుగున ఉన్న హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, ఏపిలో జగన్ విధ్వంసక విధానాల కారణంగా రాష్ట్రం 30 ఏళ్లు వెనకబడిపోయింది. దేశ చరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితులకు గత ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు జగన్ రద్దు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ సంక్షేమ పథకాల అన్నింటినీ పునరుద్ధరిస్తాం. పేద విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి గతంలో అమలుచేసిన అంబేద్కర్ విదేశీ విద్యను తిరిగి ప్రారంభిస్తాం. మంగళగిరి ప్రాంతంలో రోజురోజుకు కుచించుకుపోతున్న చేనేత మగ్గాలను 5వేలకు పెంచి, మళ్లీ గత వైభవం తెస్తాం. జగన్ అస్తవ్యస్త పాలన లో దారితప్పిన రాష్ట్రాన్ని విజనరీ లీడర్ చంద్రబాబునాయుడు తిరిగి గాడిలో పెడతారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed