కలెక్టర్‌తో గోడు వెల్లబోసుకున్న రెవెన్యూ అధికారులు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : విఆర్ఓ వ్యవస్థ రద్దుతో రెవెన్యూ ఉద్యోగులపై తీవ్రమైన పని ఒత్తిడి నెలకొందని..

Update: 2022-08-05 16:01 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : విఆర్ఓ వ్యవస్థ రద్దుతో రెవెన్యూ ఉద్యోగులపై తీవ్రమైన పని ఒత్తిడి నెలకొందని, క్షేత్రస్థాయిలో విచారణ చేయడానికి అధికారులు కరువయ్యారని, వీఆర్ఏలు కూడా సమ్మెలో ఉండడం వలన కార్యాలయంలో తీవ్రమైన పని ఒత్తిడి నెలకొందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి, కార్యదర్శి ప్రశాంత్‌లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి తమ గోడును వెల్లబోసుకున్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్‌ను కలిసి ముఖ్యంగా ధరణి అప్లికేషన్స్ రిపోర్ట్స్ పంపడానికి రోజువారీ సర్టిఫికెట్ల అప్రూవల్‌కి వివిధ రకమైన సమాచారం సేకరణకి పాత రెవెన్యూ రికార్డు సమాచారం సేకరణకు వీఆర్ఏలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.

వీఆర్ఏలు విధులకు దూరం అవడం వల్ల అన్ని తహశీల్దార్ కార్యాలయంలో తీవ్రమైన పని ఒత్తిడి నెలకొందని తెలిపారు. కార్యాలయంలో తగిన మేరకు సిబ్బంది లేనందువలన తమ పైన టార్గెట్లు పెట్టి పని ఒత్తిడి పెంచరాదని విన్నవించుకున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏలు విధులకు దూరంగా ఉండడం వలన కలుగుతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అలాగే వీఆర్వోలకు ప్రత్యామ్నాయంగా క్షేత్రస్థాయిలో అవసరమైన విచారణలు చేపట్టడానికి తగిన మేరకు అదనపు సిబ్బందిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని తహసిల్దార్లు, డిప్యూటీ తహసీల్దారులు, గిర్ధావర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


Similar News