తండ్రి బాటలో జగన్.. ప్లీనరీ వేదికగా కీలక నిర్ణయం!
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం జగన్ మీద సొంత పార్టీ శ్రేణుల నుంచి కూడా వెలువడే ప్రధాన విమర్శ ఆయన ఎవరికీ అందుబాటులో ఉండరనే..!
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం జగన్ మీద సొంత పార్టీ శ్రేణుల నుంచి కూడా వెలువడే ప్రధాన విమర్శ ఆయన ఎవరికీ అందుబాటులో ఉండరనే..! కేబినెట్ మీటింగ్ సమయంలో తప్ప కొందరు మంత్రులకు సైతం జగన్ అప్పాయింట్ మెంట్ అంత సులభంగా దొరకదని సచివాలయంలో కూడా చెవులుకొరుక్కునే ఘటనలు అనేకం. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఒక హైరార్కీ వ్యవస్థ ఉన్నప్ప్పుడు అందరూ దానిని ఫాలో కావాలనేది జగన్ అభిమతం అనీ అందుకే మధ్యస్థాయి లీడర్లకు ,నాయకులకూ కూడా విలువ దక్కేలా ఉండడానికి నిచ్చెన మెట్ల వ్యవస్థనే జగన్ ఫాలో అవుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ వచ్చారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలు కానున్న నేపథ్యంలో ఇక తానే కింది స్థాయి కార్యకర్తలూ, ప్రభుత్వ వర్గాలకూ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని, దానికోసం వచ్చే 15 రోజుల్లో జరుగనున్న వైసీపీ ప్లీనరీ వేదికగా కీలక నిర్ణయాలు ప్రకటించబోతున్నారనే కథనాలు వెలువడుతున్నాయి.
ప్లీనరీ వేదికగా కొత్త కమిటీల ప్రకటన
సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన సాధారణ కార్యకర్తలకూ, క్షేత్రస్థాయి నాయకులకూ అందుబాటులో లేరనే విమర్శ గట్టిగానే ఉంది. ఏవైనా బహిరంగ సభలు జరిగినప్పుడు అక్కడి నుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడడం తప్ప, మామూలు కార్యకర్తలు ఆయన్ను కలుసుకునే అవకాశం చాలా తక్కువ. ఇక మంత్రుల పరిస్థితీ అంతే అంటున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలదే ప్రధాన పాత్ర. జగన్మోహన్ రెడ్డికీ, పార్టీకీ మధ్య వారధి ఈ ముగ్గురే. వీరిలో సజ్జల రామకృష్ణా రెడ్డి అయితే ప్రభుత్వ సలహాదారుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ సీఎం వరకూ తీసుకెళ్లాల్సిన విషయాలు ఏవైనా ఉంటే అవి సజ్జల ద్వారానే తీసుకెళ్తారనే ప్రచారం ఉంది. విపక్షాలు సైతం ఆయనపై షాడో సీఎం అంటూ విమర్శలు గుప్పించాయి. అయినప్పటికీ జగన్ ప్రభుత్వంలో గానీ, వైసీపీ పార్టీలో గానీ ప్రధాన పాత్ర ఈ ముగ్గురిదే.
ఇక డైరెక్ట్ కాంటాక్ట్లోకి రానున్న జగన్
అయితే ఎన్నికల హడావుడికి రాష్ట్రంలో రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ పద్ధతిని మార్చాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై సాధారణ ప్రజలుగానీ, కార్యకర్తలు గానీ తనను డైరెక్ట్గా కలిసేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గ స్థాయిలోనూ ఈ కమిటీలను వేయనున్నారు. తద్వారా తనను కలవాలనుకునే వారికి వెసులుబాటు కలిగించి, రోజులో ఎంతోకొంత సమయం కేటాయించాలని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏర్పాటు గురించిన వివరాలను త్వరలో జరగబోయే ప్లీనరీలో ప్రకటించబోతున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేసింది ఇదే
సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి గతంలో పాటించిన పద్ధతి ఇదే. రచ్చబండ పేరుతో తానే జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చెయ్యడం ,లేదా రోజూ ఉదయమే ఒకగంట పాటు ప్రజలు తనను స్వయంగా కలిసే అవకాశం కలిగించడం ఇలా రకరకాల కార్యక్రమాలతో తనకూ, ప్రజలకూ గ్యాప్ లేకుండా చూసుకునే వారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో వెనుకబడే ఉన్నారనే విమర్శ ఉంది. గతంలో రచ్చబండ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తారని ప్రచారం జరిగినా ఎందుకనో అనుకున్నవిధంగా దానిని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఇప్పుడు ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి, ప్రజలతో ఎలాంటి గ్యాప్ లేకుండా చేసుకోవడానికి వీలుగా కొత్త కార్యాచరణను ఆయన రూపొందించారని, ప్లీనరీలోనే వాటిని ప్రకటిస్తారని తెలుస్తోంది.
అభివృద్ధి లేదంటూ వస్తున్న విమర్శలకూ చెక్
అలాగే జగన్ ప్రభుత్వంపై వస్తున్న ప్రధాన విమర్శ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని. వస్తున్న ఆదాయాన్ని వివిధ పథకాల కింద జనానికి పంచుతున్నారు గానీ రాష్టంలో అభివృద్ధి పనులపై జగన్ దృష్టి పెట్టలేదని, ఇటు ప్రజాసంఘాల నేతలూ, అటు వైరిపక్షాలూ ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రజలకు తమ వెర్షన్ వినిపించడంతో పాటు రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామో అనేది వివరించడానికి.. ప్లీనరీ వేదికగా నియమించనున్న కమిటీలను ఉపయోగించే ఆలోచనలో సీఎం ఉన్నారని పార్టీ వర్గాలు లీకులు అందిస్తున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపైనా ఫోకస్
ఇక ఇప్పటికే ఎమ్మెల్యే పనితీరుపై సీఎం వద్ద ఒకటికి రెండు నివేదికలు ఉన్నాయని చెబుతున్నారు. జనంతో మమేకం అవ్వని నేతలకు, పనిచేయని ఎమ్మెల్యేలకు మరలా సీటును ఇచ్చేది లేదని చెబుతున్నారు ముఖ్యమంత్రి. ఇప్పడు ప్రజల నుంచి కూడా డైరెక్ట్గా ఎమ్మెల్యేల పనితీరుపై వివరాలు తెలుసుకునే యాక్షన్ ప్లాన్కూ ఆయన సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పనిచెయ్యని ఎమ్మెల్యేలలో కలవరం మొదలైందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరి సీఎం ఆలోచనలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.