సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకు?

ఒంటెద్దు పోకడతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేశాడని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

Update: 2023-05-12 07:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఒంటెద్దు పోకడతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేశాడని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎంకు ముఖ్య సలహాదారుగా నియమించడంపై పరోక్షంగా రియాక్ట్ అయిన షర్మిల.. చెవిటోని ముందు శంఖం ఊదినట్లుగా సలహాలు తీసుకోని వ్యక్తికి సలహాదారులు ఎందుకో అని సెటైర్లు వేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. ప్రజల గోస వినే కమిషన్లకు ఆఫీసర్లు లేరు కానీ దోచిపెట్టే సలహాదారులను పక్కన చేర్చుకున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పక్క రాష్ట్రాల వ్యక్తులకు లక్షల జీతమిచ్చి మేపుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి పని చేస్తున్నారని వీళ్లు ప్రజా సమస్యలపై ఏం సలహా ఇస్తారని నిలదీశారు. రుణమాఫీ అమలు, ఉద్యోగాల భర్తీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతు బీమా అమలు, నిరుద్యోగ భృతి, పోడు భూముల పట్టాలు ఇవ్వమని ఈ సలహాదారులు ఎందుకు సలహాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ సమస్యలను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు.

చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. ఎన్నికల శంఖారావం తలపించేలా! 

Tags:    

Similar News