రాహుల్ వ్యాఖ్యలు ఆదర్శం: నిరంజన్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసి బీజేపీ, టీఆర్ఎస్ సహా ఇతర పార్టీలకు కాంగ్రెస్ సవాల్ విసిరిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అన్నారు.

Update: 2022-09-23 13:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసి బీజేపీ, టీఆర్ఎస్ సహా ఇతర పార్టీలకు కాంగ్రెస్ సవాల్ విసిరిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. "ఏఐసీసీ అధ్యక్ష పదవి కేవలం సంస్థాగతమైనదే కాదు. నిర్దిష్ట విలువలు, విశ్వసనీయ వ్యవస్థ, భారత దార్శనికతకు ప్రతిబింబమని గుర్తుంచుకోవాలి" అని రాహుల్ గాంధీ అధ్యక్ష ఎన్నికలపై కామెంట్స్ చేశారని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో మరిచిపోయిన మూల సిద్దాంతాలను జ్ఞాపకం చేస్తూ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేయడం హర్షనీయమన్నారు. 137 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ మూల సిద్ధాంతాలను మరుస్తున్న ఈ తరానికి రాహుల్ వ్యాఖ్యలు ఆదర్శమని, ప్రతి కార్యకర్త, నాయకుడు అనుసరించాలని అన్నారు. దేశంలోని అనేక పీసీసీలు, తానే అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానించినా, గాంధీయేతర కుటుంబం నుండే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరగాలనే తన నిర్ణయానికి కట్టుబడి, కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడం, కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యానికి తావు ఉండదని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. పాదయాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ, ఈ యాత్ర ముగిసేనాటికి అనేక వర్గాలు, భాషలు, సంస్కృతులతో కూడిన భారత ప్రజలతో మమేకమై ఈ దేశ ఏకైక నాయకుడిగా గుర్తింపు పొంది ప్రజలకు సేవ చేయడం తథ్యమన్నారు.

Tags:    

Similar News