సిద్ధ రామేశ్వరాలయంలో కన్నుల పండువగా స్వామి వారి కల్యాణం

భాజా భజంత్రీలు... వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛరణాల మధ్య స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

Update: 2023-03-13 10:47 GMT

దిశ, భిక్కనూరు: భక్తుల జయ జయ ద్వనాలు... భాజా భజంత్రీలు... వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛరణాల మధ్య స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణ కాశీ భిక్కనూరు సిద్ధ రామేశ్వరాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అందంగా అలంకరించిన ముత్యాల పందిట్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెట్టి ఆలయ అర్చకులు కొడకండ్ల రామగిరి శర్మ, కొడకండ్ల సిద్ధ రామ శర్మ, న్యాల కంటి రాజేశ్వర శర్మ, వేద పండితులు కుప్ప జగన్నాథ శర్మ, గోపికృష్ణ శర్మ, సాయి, నిఖిల్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణ ఘట్టాన్ని జరిపించారు.

ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ స్వామివారి కల్యాణానికి హాజరై మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలిరావడంతో కల్యాణ మండపం భక్తుల రద్దీతో నిండిపోయింది. గంగా పార్వతీ సమేత శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి వారి కల్యా ణం జరిగినంత సేపు కల్యాణంలో కూర్చున్న భక్తులు స్వామివారిని స్మరించుకున్నారు. దేవతా మూర్తులైన పార్వతి మెడలో పరమేశ్వరుడు మూడుముళ్లు వేసే కల్యాణ క్రతువును రెండు గంటల పాటు విప్ గంప గోవర్ధన్ ఓపికగా కూర్చుని తిలకించారు.

ఆయనతో పాటు వచ్చిన భక్తులు గంగా పార్వతీ సమేత సిద్ధ రామేశ్వరునిపై అక్షింతలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి, పీఠాధిపతి సిద్ధగిరి సదాశివ మహంత్, ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పెద్ద బచ్చ గారి నర్సింహారెడ్డి, సర్పంచు తునికి వేణు, డీసీసీబీ డైరెక్టర్ లింగాల కిష్టాగౌడ్, కామారెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టెడి భగవంత రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తాటిపాముల పద్మ నాగభూషణం గౌడ్, ఆర్‌బి‌ఎస్ చైర్మన్ బోండ్ల రామచంద్రం, ఆలయ ఈఓ పద్మ శ్రీధర్, వైస్ చైర్మన్ పట్లోళ్ల హన్మంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్‌లు నాగర్తి భూoరెడ్డి, బాలగోని రాజా గౌడ్, గంగల భూమయ్య, ఉప సర్పంచ్ బోడ నరేష్, పునర్నిర్మాణ కమిటీ డైరెక్టర్లు వెంకమ్మ గారి బస్వయ్య, మామిడి శ్రీనివాస్ రెడ్డి, తాటిపల్లి శ్రీనివాస్ గుప్తా, అబ్బ బాలకిషన్, పొగడపల్లి సిద్ధారెడ్డి, తాటికొండ బాబు, పోచమైన రాజయ్య, నిట్టూరి నిర్మల, సరస్వతి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

ఓడి బియ్యం పోసేందుకు క్యూ..

కల్యా‌ణం అనంతరం జిల్లా రాష్ట్ర నలుమూలల నుంచి మంగళ హారతులతో తరలివచ్చిన మహిళలు దేవతామూర్తులకు ఓడి బియ్యం పోసేందుకు క్యూలో నిల్చో వలసిన పరిస్థితి తలెత్తింది. కళ్యాణం ముగిసిన వెంటనే ఒక్కసారిగా భక్తులు వేదిక వద్దకు చేరుకొని అక్షింతలు వేసేందుకు పోటీ పడడంతో కల్యా‌ణం‌లో కూర్చున్న పలువురు దంపతులు ఓడి బియ్యం పోసేందుకు చాలాసేపు మండపంలో కూర్చోవలసి వచ్చింది. దీంతో ఆలయ సిబ్బంది, పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ప్రత్యేక దృష్టి సారించి క్రమ పద్ధతిలో ఓడిబియ్యం పోసేందుకు అనుమతించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వచ్చిన భక్తులు ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు.

అగ్ని గుండంలో నడిచిన భక్తులు...

వేకువ జామున జరిగిన వీరభద్ర ప్రస్తావన, అగ్నిగుండాలను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. జంగమ సమాజం వారి దండకాలు, ఆలయ అర్చకులు ప్రభు సిద్దేశ్ మంత్రోచ్ఛరణాల మధ్య స్వామి వారిని స్మరించుకుంటూ అగ్నిగుండంలో నడిచారు. స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అగ్నికీలలపై నడవడం వలన అంతా బాగా జరుగుతుందన్న నమ్మకంతో స్వామివారిని స్మరించుకుంటూ కిందకు చూడకుండా నడిచారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయి.

Tags:    

Similar News