ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ.. చేవెళ్ల బరిలో 43 మంది అభ్యర్థులు
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ
దిశ,రంగారెడ్డి బ్యూరో: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజవర్గం స్థానానికి నామినేషన్ వేసిన ముగ్గురు ఉపసంహరించుకున్న ట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక్ తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి 64 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, స్క్రూటినీ సందర్భంగా 18 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. మిగతా 46 మంది అభ్యర్థులలో ముగ్గురు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు.
అనంతరం రాజేందర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో అభ్యర్థుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే నామినేషన్ల గడువు ముగియడంతో ఉపసంహరణ చేసుకున్న అభ్యర్థులను జాబితా నుంచి తొలగించి మిగిలిన 43 అభ్యర్ధులకు గుర్తులు కేటాయించే ప్రక్రీయ జరిగినట్లు తెలిపారు. స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసిన దుదేకుల మహ్మద్ ఇమామ్ హుస్సేన్, మరో స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ చాంద్ పాషా, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్ధి గోపి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ రాజేందర్ కుమార్ కటారియా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, నామినేషన్లు వేసిన అభ్యర్థులు పాల్గొన్నారు.