కేసీఆర్ ప్రచార నిషేధంలో బడే భాయ్...చోటా భాయ్ కుట్ర : జగదీశ్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై ప్రచార నిషేధం విధించడం ప్రధాని నరేంద్ర మోడీ,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే అని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.

Update: 2024-05-02 13:40 GMT

దిశ , సూర్యాపేట : బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై ప్రచార నిషేధం విధించడం ప్రధాని నరేంద్ర మోడీ,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే అని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియా మాట్లాడారు.మోడీ,రేవంత్ చేసిన విద్వేష ప్రసంగాలు,ఫేక్ వీడియోలు ఈసీకి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు నేత కార్మికులని అవమానకరంగా మాట్లాడిన సందర్భంలో స్పందించిన కేసీఆర్ మాటలను వక్రీకరించారని అన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్, మోడీకి వణుకుడు మొదలైందని,ఆరు యాత్రలతోనే ఆ ఇద్దరి కాళ్ళ కింద భూమి కంపిస్తుందని పేర్కొన్నారు. బడే భాయ్...చోటా భాయ్ ఇద్దరూ కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ వెంట ప్రజాప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రెట్టింపు ప్రజా మద్దతు వస్తుంది అన్నారు. మోడీ విద్వేషాలు ప్రచారం ఈసీకి కనిపించడంలేదా అంటూ ఫైర్ అయ్యారు.ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే రేవంత్ కి నోటీసులు, మా సోషల్ మీడియా ఇంఛార్జి క్రిషాంక్ అరెస్టు,మా అధినేత కేసీఆర్ కి మాత్రం ప్రచార నిషేధమా అంటూ ప్రశ్నించారు.కేసీఆర్ ని అడ్డుకోకపోతే నష్టం జరుగుతుందనే కుట్రకు తెరలేపారని అన్నారు.వీధి రౌడిగా మాట్లాడిన రేవంత్ స్వేచ్ఛగా తిరిగితుంటే కేసీఆర్ ని మాత్రం ఇంట్లో పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ ఢిల్లీ మాటల పై సమాచారం ఉంటే మోడీ ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. రేవంత్ అవినీతి తెలిసినా మోడీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని అన్నారు. కేసీఆర్ లెవనెత్తుతున్న ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా పక్కదారిపట్టించడం కోసమే డ్రామాలు ఆడుతున్నారని, నిషేధాలు ఏవి కేసీఆర్ ని ఆపలేవు అన్నారు. కేసీఆర్ ప్రచారంలో ఎందుకు కనిపించడంలేదని ప్రజల్లో చర్చ మొదలైంది అన్నారు. ఎన్ని నిషేధాలు పెట్టినా 16 సీట్లు మావే అన్నారు. కేసీఆర్ కు మద్దతుగా నేతన్నలు కదిలివస్తున్నారని అన్నారు.

కేసీఆర్ ని ప్రచారం చేయకుండా ఆపడం మా ఓట్ల శాతాన్ని పెంచుతుంది అన్నారు. రేపు విచారణకు రానున్న ఓటుకు నోటు కేసుపై మాట్లాడిన జగదీష్ రెడ్డి , ఓటుకి నోటు కేసు ఇక్కడ ఉంటే ప్రభావితం చేస్తారని అనుమానం ఉందన్నారు. అందుకే ఇతర రాష్ట్రంలోకి మార్చాలని కోరాం అన్నారు. కోర్టు నుంచి సరైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

Similar News