నిజాంపేట్ లో బిల్డర్ కబ్జా దర్బార్.. ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తూ స్థానికులపై చిర్రు బుర్రు..

ప్రభుత్వ స్థలం కొల్లగొట్టేందుకు ఓ బిల్డర్ కుయుక్తులు పన్నాడు. తన పట్టా భూమిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్ స్థలం విలువ కోట్ల రూపాయలకు పలకనుండడంతో ఆ స్థలం కాజేసేందుకు పూనుకున్నాడు.

Update: 2023-03-30 12:18 GMT

దిశ, కుత్బుల్లాపూర్: ప్రభుత్వ స్థలం కొల్లగొట్టేందుకు ఓ బిల్డర్ కుయుక్తులు పన్నాడు. తన పట్టా భూమిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్ స్థలం విలువ కోట్ల రూపాయలకు పలకనుండడంతో ఆ స్థలం కాజేసేందుకు పూనుకున్నాడు. కొద్ది కొద్దిగా అట్టి ప్రభుత్వ స్థలం తన ఆధీనంలోకి తీసుకుని కబ్జా కథకు సదరు లోకల్ బిల్డర్ ప్రాణం పోస్తున్నాడు. బిల్డర్ చెర బట్టిన ప్రభుత్వ స్థలం విలువ ఇక్కడి బహిరంగ మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.5 కోట్ల పైనే పలుకుతుంది. ఈ బిల్డర్ కబ్జా నుంచి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని పలువురు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్లితే.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 12 వ డివిజన్ లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను కట్టించింది. బాచుపల్లి మండలం రెవిన్యూ పరిధిలో గల నిజాంపేట్ సర్వే నెంబర్ 233/15, 233/16 లలో 5 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ స్థలం ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఇందిరమ్మ ఇళ్ల ఫేస్ -2 కింద మొత్తం 27 బ్లాక్ లు గా నిర్మించేందుకు లే అవుట్ వేసింది. అయితే అందులో 25 బ్లాక్స్ మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల సముదాయలను నిర్మించి మిగతావి రెండు బ్లాక్స్ స్థలాన్ని ఏపీ హోసింగ్ బోర్డు అధికారులు కాళీగా వదిలేశారు. ప్రస్తుతం ఈ కాళీ స్థలంపై కన్నేసిన లోకల్ బిల్డర్ అదును చూసి కోట్ల రూపాయలు విలువ చేసే సర్కారు జాగాను మింగేసేందుకు పథకం రూపొందించాడు.

ఇదీ ప్రభుత్వ స్థలం కదా, మాకు ఇందిరమ్మ ఇళ్ల కోసం కేటాయించారు కదా అని కబ్జా చేస్తున్న లోకల్ బిల్డర్ కు స్థానికులు అడ్డు చెబితే ఆ బిల్డర్ స్థానిక పేదలపై జులుం ప్రదర్శిస్తున్నాడని పలువురు వాపోతున్నారు. నేను లోకల్ నాకే ఎదురు చెబుతారా? ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి మాకే ఎదురు చెబుతారా అంటూ కబ్జా బిల్డర్ స్థానికులపై తరచూ చిర్రు బుర్రు లాడుతున్నట్లు సమాచారం. ఈ కబ్జాను అరికట్టి ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తున్న సదరు బిల్డర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదిగో ఇలా కబ్జా తీరు..

నిజాంపేట్ లోని ఇందిరమ్మ కాలనీలో తన పట్టా నెంబర్ ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్ 233/15,233/16 లోని సుమారు 600 చదరపు గజాలు స్థలం కొట్టేసేందుకు లోకల్ బిల్డర్ కుటిల బుద్దిని కానిస్తున్నాడు. గతంలో మొదట చదును చేసి ఏకంగా బడా అపార్ట్మెంట్ నిర్మించేందుకు లోకల్ బిల్డర్ ప్రయత్నం చేయగా స్థానికులు ఈ స్థలం ప్రభుత్వ స్థలం అని అడ్డుకున్నారు. రెవిన్యూ అధికారుల నుంచి కూడా ఒత్తిడి రావడంతో గత కొన్ని సంవత్సరాల కాలం నుంచి కూడా ఆ స్థలం ఖాళీగా ఉంది.

అయితే ఆ బిల్డర్ తన పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే దుర్బుద్ధితో తన పట్టా భూమిలో ప్రభుత్వ స్థలం కలిపేసుకుని ప్రైవేట్ మినీ క్రికెట్ స్టేడియం నిర్మించి అద్దెకు ఇచ్చేందుకు రెడీ చేశాడు. స్థానికులు అభ్యంతరం చెప్పినప్పటికీ వారినే తిరిగి బెదిరిస్తూ కబ్జా పర్వం కానిచ్చాడు. దీంతో ఇందిరమ్మ కాలనీ వాసులు మా స్థలం మాకు కాపాడి ఇవ్వండి అంటూ ప్రభుత్వ కార్యాలయాల మెట్లు ఎక్కుతున్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మేయర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం కాపాడాలని, కబ్జా చేసిన లోకల్ బిల్డర్ పై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News