'కేసీఆర్ అబద్ధాల పుట్టా.. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి'

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ధీమా....Ex MLC Ramachandhra rao comments on CM KCR

Update: 2022-11-26 13:08 GMT

దిశ, అమీన్ పూర్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం పటాన్ చెరు మండలంలోని బచ్చగూడ గ్రామంలో గల పద్మావతి ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశనికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాల పుట్ట అని ధ్వజమెత్తారు. ఉద్యమ సమయం నుండి కేసీఆర్ చెప్పేది ఒకటి, చేసేది మరొకటని, ప్రజలను మభ్య పెట్టేలా హామీలు ఇవ్వడం తర్వాత వాటికి తిలోదకాలు ఇవ్వడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని అన్ని వర్గాలను తీవ్ర మోసం చేశాడన్నారు. మిగిలిన నిధులతో సిద్ధించిన తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చడమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ మాఫియా, మద్యం మాఫియాగా మార్చిన గొప్ప ఘనత కేసీఆర్ కే దక్కుతుందని విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ మోసాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని, ప్రజల మద్దతుతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ ఇంచార్జ్ అట్లూరి రామకృష్ణ, మాజీ మంత్రి బాబు మోహన్, మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్, విజయపాల్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశ్ పాండే, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, బీజేపీ పటాన్ చెరు అసెంబ్లీ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, నాయకులు ఎడ్ల రమేష్, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News