కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం

వైరాలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వైరాలోని తల్లాడ రోడ్ లోని వే బ్రిడ్జి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో రేపు ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.

Update: 2023-03-25 13:47 GMT

దిశ, వైరా : వైరాలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వైరాలోని తల్లాడ రోడ్ లోని వే బ్రిడ్జి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో రేపు ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు ధరావత్ రామ్మూర్తి నాయక్, జిల్లా నాయకులు కట్ల రంగారావు పర్యవేక్షిస్తున్నారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు ఠాక్రే, రోహిత్ చౌదరి, నదీమ్ జావేద్, మాజీ మంత్రి రేణుక చౌదరి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ముందుగా వైరాలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద కాంగ్రెస్ అగ్ర నాయకులకు స్థానిక శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నాయి.

    అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి వైరాలోని మధిర క్రాస్ రోడ్డు వరకు హాత్ సే హాత్ జూడో యాత్రను నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభను జరపనున్నారు. ఈ సభకు మొత్తం పదివేల మంది జన సమీకరణ చేస్తున్నారు. ఈ సభ సందర్భంగా వైరాలోని ప్రధాన కూడళ్ల తో పాటు డివైడర్లను కాంగ్రెస్ పార్టీ జెండాలతో, తోరణాలతో సుందరంగా అలంకరించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు వైరాలోని మల్లు భట్టి విక్రమార్క వర్గీయులు దూరంగా ఉన్నారు. తమకు ఈ సభకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని భట్టి విక్రమార్క వర్గీయులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News