పోలీసులు లేకుండా KCR అడుగు కూడా బయటపెట్టే పరిస్థితి లేదు: గంగాడి కృష్ణారెడ్డి
మంత్రి కేటీఆర్ కమలాపూర్ పర్యటన సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు.
దిశ, కరీంనగర్ టౌన్: మంత్రి కేటీఆర్ కమలాపూర్ పర్యటన సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. మంత్రి కేటీఆర్ పర్యటన 24 గంటల ముందే బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు అక్రమంగా తరలించడంపై ఆయన మండిపడ్డారు. మంత్రి పర్యటనను బీజేపీ ఆధ్వర్యంలో అడ్డుకోవడానికి ఎలాంటి పిలుపునివ్వకపోయినా అక్రమంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించడం తగదన్నారు. తెలంగాణలో స్వేచ్ఛ వాతావరణం లేకుండా పోయిందని, రాష్ట్రంలో కేసీఆర్ పోలీసులు లేకుండా ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు.
ఇంతలా నిర్బంధాలు, అరెస్టులతో ప్రతిపక్షాలను భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. బీఆర్ఎస్ నేతల పర్యటన అనగానే ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్టు చేయడం ప్రభుత్వం అలవాటుగా మార్చుతుందని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ సర్కార్ కూని చేస్తుందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనేక హామీలు, వాగ్దానాలు గుప్పించిందని.. తీరా ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. నియోజకవర్గంలో గతంలో కట్టించిన బిల్డింగులకు ఇప్పుడు శిలాఫలకాలు వేసుకొని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సిగ్గుచేటు అన్నారు.