ఆ ముగ్గురు నేతల చేరికలు రద్దు.. ప్రకటించిన కాంగ్రెస్
ఆదిలాబాద్ నుంచి నేతల చేరికలపై కాంగ్రెస్ షాక్ ఇచ్చింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఆదిలాబాద్ నుంచి నేతల చేరికలపై కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. ఇటీవల గాంధీభవన్లో చేరికల కమిటీ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి జాయినింగ్స్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు శుక్రవారం పార్టీ ప్రకటించింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. ఇక నుంచి పార్టీలో చేరికలన్నీ దీపాదాస్ మున్షి ఆదేశాల ప్రకారం మాత్రమే జరుగుతాయన్నారు. పార్టీలో చేరాలనుకునే నేతలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కండువాలు కప్పుతామని జగ్గారెడ్డి స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తుందని, లీడర్లు, కేడర్లంతా కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నారని తెలిపారు. ఆదిలాబాద్ నేతల చేరికపై ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కృషి చేసినోళ్లను ఎలా చేర్చుకుంటారు అంటూ ఆదిలాబాద్లో నిరసనలు నిర్వహించారు. ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో జాయినింగ్స్కు బ్రేకులు వేశారు.