ఖానాపూర్‌కు చేరిన బండి పాదయాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగ్రామ యాత్ర జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గ సమీపానికి చేరింది...Bandi Sanjay Padayatra Rechead to Khanapur

Update: 2022-12-06 14:27 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగ్రామ యాత్ర జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గ సమీపానికి చేరింది. మంగళవారం అక్కడే బస చేయనున్న బండి సంజయ్ బుధవారం ఉదయం తన పాదయాత్రను ప్రారంభించి మధ్యాహ్నం ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ నియోజకవర్గం పార్టీ శ్రేణులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటికే ఖానాపూర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ బహిరంగ సభా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. పది నుంచి 15 వేల మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు కమలం శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఆధ్వర్యంలో జన సమీకరణ భారీగా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయన తన వర్గీయులైన ముఖ్యనేతలతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సమాచారం అందించి జనాల తరలింపునకు ఏర్పాట్లు చేశారు. రాథోడ్ రమేష్ తోపాటు ఆయన తనయుడు రితీష్ రాథోడ్, ఖానాపూర్ లోనే మకాం వేసి బహిరంగ సభ ఏర్పాట్లు చూస్తున్నారు.

బండిని కలిసిన ముధోల్ నిజామాబాద్ నేతలు...

పాదయాత్ర సందర్భంగా నిర్మల్ నియోజకవర్గం దాటిన బండి సంజయ్ ను వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. మంగళవారం ఉదయం మామడ సమీపంలో వేసిన తాత్కాలిక క్యాంపు వద్ద బండి సంజయ్ నిజామాబాద్ జిల్లా పార్టీ పాదాధికారులతో సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. కాగా ముధోల్ నియోజకవర్గ పార్టీ సీనియర్ నేత మోహన్ రావు పటేల్ కూడా తన అనుచరులతో వచ్చి బండిని కలిశారు. ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.

Similar News