Sunita Williams: ఆ కారణాలతో వాయిదా పడిన సునీతా విలియమ్స్‌ రోదసి యాత్ర.. మళ్ళీ ఎప్పుడంటే..?

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ముచ్చటగా మూడోసారి రోదసీ యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు.

Update: 2024-05-07 03:59 GMT

దిశ వెబ్ డెస్క్: ఇప్పటికే రెండుసార్లు అంతరిక్షంలోని వింతలు చూసి వచ్చిన భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ముచ్చటగా మూడోసారి రోదసీ యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 8.04 గంటలకు సునీతా విలియమ్స్‌‌ను రోదసి తీసుకువెళ్ళే బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకను, లిఫ్ట్-ఆఫ్‌కు కేవలం 90 నిమిషాల ముందు అట్లాస్ V రాకెట్ ప్రయోగాన్ని నాసా నిలిపివేసింది.

ఇంజిన్‌లో వాల్వ్​ సమస్య తలెత్తిన కారణంచేత సునీతా విలియమ్స్‌ మూడోసారి రోదసీ యాత్ర వాయిదా పడింది. ఈ విషయంపై యూనైటెడ్ లాంఛ్ అలయన్స్ ఇంజినీర్ దిల్లాన్ రైస్ మాట్లాడుతూ.. అట్లాస్​ రాకెట్​లోని అప్పర్​ స్టేజ్‌లో ఆక్సిజన్​ వాల్వ్​ సమస్య ఏర్పడిందని తెలిపారు. ఇలా స్టార్‌లైనర్‌ స్పేస్‌క్రాఫ్ట్ నిర్మాణంలో సమస్యలు తలెత్తడం ఇది మొదటిసారి కాదు.

గతంలోను క్యాప్యూల్​ సమస్య ఎర్పడింది. దీనితో సునీతా విలియమ్స్‌ 3వ రోదసి యాత్ర ఆలస్యం అయ్యింది. కాగా నాసా చేపట్టిన ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుంది. ఇక ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక మాత్రమే ఈ సేవలు అందిస్తోంది. అయితే స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి.

కాగా గతంలో సునీతా విలియమ్స్‌ 322 రోజులు అంతరిక్షంలో గడిపి రికార్డు సృష్టించారు. ఇక ఈ రోజు ప్రయోగం విజయవంతమై ఉంటే.. కొత్త స్పేస్ షటిల్ యొక్క మెయిడెన్ క్రూడ్ మిషన్‌లో ప్రయాణించిన మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించేవారు. కాని దురదృష్టవశాత్తు ఈ రోజు రోదసిలోకి దూసుకెళ్ళాల్సిన అట్లాస్ V రాకెట్ సాంకేతిక లోపాల కారణంగా నిలిచిపోయింది. అయితే అట్లాస్ V రాకెట్ మళ్లీ ఎప్పుడు లాంచ్ చేస్తారు అనే విషయాన్ని నాసా పేర్కొనలేదు.  

Similar News