అతి పలుచనైన కొత్త ఐప్యాడ్ ప్రోను విడుదల చేసిన యాపిల్

11 అంగుళాలతో వచ్చే ఐప్యాడ్ ప్రో 5.33ఎంఎం, 13 అంగుళాల వెర్షన్ 5.1ఎంఎం మందంతో వచ్చాయి.

Update: 2024-05-07 16:00 GMT

దిశ, టెక్నాలజీ: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన సరికొత్త ఐప్యాడ్ ప్రోను మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఇప్పటివరకు కంపెనీ నుంచి వచ్చిన అతి పలుచనైన ఐప్యాడ్ కావడం విశేషం. 11 అంగుళాలతో వచ్చే ఐప్యాడ్ ప్రో 5.33ఎంఎం, 13 అంగుళాల వెర్షన్ 5.1ఎంఎం మందంతో వచ్చాయి. ఈ మోడళ్లు ఆల్ట్రా రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. వీటి స్క్రీన్లను కూడా నానో-టెక్చర్ గ్లాస్‌తో తయారు చేశారు. కొత్త ఐప్యాడ్ ప్రో ఎం2 చిప్ నుంచి గణనీయమైన అప్‌గ్రేడ్‌తో ఎం4 చిప్‌సెట్‌తో రావడం గమనార్హం. ఇది మరింత ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది. మంగళవారం నుంచే వినియోగదారులు యాపిల్ అధికారిక వెబ్‌సైట్, యాపిల్ స్టోర్ల నుంచి కొత్త ఐప్యాడ్ ప్రోను ఆర్డర్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. కొత్త ఐప్యాడ్ ప్రో 256జీబీ, 512జీబీ, 1టీబీ, 2టీబీ వంటి నాలుగు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ధరలకు సంబంధించి 11 అంగుళాల వెర్షన్ వైఫై మోడల్ ధర రూ. 99,900, వైఫై+సెల్యూలార్ ప్రారంభ ధర రూ. 1,19,900గా నిర్ణయించారు. 13 అంగుళాల వెర్షన్ ధర వైఫై రూ. 1,29,900, వైఫై+సెల్యూలార్ ధర రూ. 1,49,900 నుంచి ప్రారంభమవుతుంది. ఇక, ఈ ఐప్యాడ్‌కు వచ్చే ఆపిల్ పెన్సిల్ ప్రో ధర రూ. 11,900, ఆపిల్ పెన్సిల్ (యూఎస్‌బీ-సీ): ధర రూ. 7,900గా ఉంది.

యాపిల్ సంస్థ కొత్తగా మ్యాజిక్ కీబోర్డ్‌ను కూడా పరిచయం చేసింది. ఇది పెద్ద ట్రాక్‌ప్యాడ్‌తో వస్తుంది. దీనివల్ల మ్యాక్‌బుక్‌ను వాడుతున్న అనుభూతి కలుగుతుందని కంపెనీ పేర్కొంది. నలుపు, తెలుపు రంగులలో అందుబాటులో ఉండే మ్యాజిక్ కీబోర్డ్ 11-అంగుళాల మోడల్ ధర రూ. 29,900, 13-అంగుళాల మోడల్ రూ. 33,900 ధరలో లభిస్తుంది.  

Tags:    

Similar News