నాన్ స్ట్రైకర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే..
లార్డ్స్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో భారత మహిళా క్రికెట్ జట్టు మూడు మ్యాచులు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.
లండన్: లార్డ్స్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో భారత మహిళా క్రికెట్ జట్టు మూడు మ్యాచులు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ క్రీడాకారిణి చార్లీ డీన్ను భారత బౌలర్ దీప్తి శర్మ 'మన్కడింగ్' చేసింది. దీంతో క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీప్తి నిబంధనల ప్రకారమే ఆడిందని కొందరు.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మరికొందరు వాదిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంసీసీ తెలిపిన వివరాల ప్రకారం.. 'ఈ ఏడాది ఎంసీసీ క్రికెట్ చట్టాలను సవరించింది.
ఈ సవరణలో మన్కడింగ్ను కూడా రనౌట్ జాబితాలో చేర్చింది. అయితే ఈ నిబంధన వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. అయితే ఈ నిబంధనలను తీసుకురావడానికి ప్రత్యేక కారణం ఉంది. బౌలర్ బంతిని విడుదల చేయడానికి ముందు నాన్ స్ట్రైకర్లు క్రీజు దాటకుండా ఉండేందుకు ఈ నిబంధనను తీసుకొచ్చాము. బౌలర్ రన్అప్ మొదలుపెట్టిన సమయం నుంచే బంతి ఆటలోకి వచ్చినట్లు. ఆ క్షణం నుంచే బ్యాటర్, నాన్ స్ట్రైకర్ స్థానంలో ఉన్న వారు బంతిని గమనిస్తూ ఉండాలి. బౌలర్ చేతి నుంచి బంతిని విడిచిపెట్టేంత వరకు నాన్ స్ట్రైకర్లు గ్రౌండ్లోనే ఉండాలి. నిన్న జరిగిన ఉత్తేజకరమైన మ్యాచ్కు అసాధారణమైన ముగింపు లభించింది.' అని క్లబ్ పేర్కొంది. ఈ విషయంపై దీప్తి శర్మ కూడా స్పందించారు. ఇటీవల ఆటకు సంబంధించి కొన్ని నిబంధనలు మారాయని, మన్కడింగ్ను ఐసీసీ రనౌట్ జాబితాలో చేర్చిందని దీప్తి శర్మ పేర్కొన్నారు.