Modi in G20 Summit :సదస్సులో కీలక వ్యాఖ్యలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు..Latest Telugu News

Update: 2022-11-15 12:24 GMT

బాలీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను తొలగించేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో శాంతి, భద్రతకు సభ్యులు సమిష్టిగా కలిసి రావాలని కోరారు. మంగళవారం ఇండోనేషియా రాజధాని బాలీలో జరిగిన జీ 20 సదస్సులో ఆయన ఆహారం, ఇంధన భద్రతపై మాట్లాడారు. ఈ సందర్భంగా జీ 20 దేశాధినేతలకు కీలక హెచ్చరికలు చేశారు.

నేటి ఎరువుల కొరతే రేపటి ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని అన్నారు. ఆహార ధాన్యాల కోసం స్థిరమైన సరఫరా గొలుసును నిర్వహించాలని ఆయన నొక్కి చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో 130 కోట్ల ప్రజలకు ఆహార భద్రతను నిర్ధారించామని ఎత్తిచూపారు. భారత్‌లో స్థిరత్వం కలిగిన ఆహార భద్రతకై ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని మోడీ చెప్పారు.

దీంతోపాటు చిరుధాన్యాలకు తిరిగి ప్రజాదరణ దక్కేలా శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే ఏడాదిలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని మనమంతా ఎక్కడ లేని ఉత్సహాన్ని ప్రదర్శించాలని అన్నారు.

ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో జీ20కి సమర్థ నాయకత్వాన్ని అందించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. జలవాయు పరివర్తన, కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్‌లో సంక్షోభం అన్నీ కలసికట్టుగా ప్రపంచం‌లో ఉపద్రవాన్ని కలగజేశాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు అతలాకుతలమయ్యాయని అన్నారు. ఇటువంటి అంశాలలో ఐక్యరాజ్యసమితి వంటి బహుళ పక్ష సంస్థలు విఫలం అయ్యాయని చెప్పారు. ఆయా సంస్థలలో తగిన సంస్కరణలను తీసుకురావడంలో మనమంతా వైఫల్యం చెందామని పేర్కొన్నారు.

ఉక్రెయిన్ ‌యుద్ధ విరమణకు దారులు అన్వేషించాలని ఆయన కోరారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచం‌లో భారీ నష్టాన్ని కలగజేసింది. కోవిడ్ తర్వాత కాలంలో నూతన ప్రపంచ వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత మనపై ఉందన్నారు. ప్రపంచం‌లో శాంతికి, సద్భావనకు, భద్రతకు నిర్దిష్టమైన, సామూహికమైన సంకల్పం అవసరమని అన్నారు. బుద్ధుడు, గాంధీ పుట్టిన పవిత్ర భూమిలో జీ 20 దేశాల సమావేశంతో ప్రపంచానికి ఒక బలమైనటువంటి, శాంతియుత సందేశాన్ని ఇస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఇంధన సరఫరాలపై ఆంక్షలు ప్రొత్సహించొద్దు

భారతదేశం ఇంధన సంబంధిత భద్రత విషయంలో ప్రపంచంలో ముఖ్యమైనదిగా ఉందన్నారు. ప్రపంచం‌లోకెల్లా అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని చెప్పారు.

ముఖ్యంగా ఇంధన సరఫరాలపై ఎటువంటి ఆంక్షలను ప్రోత్సహించకూడదని చెప్పారు. భారతదేశం స్వచ్ఛ శక్తికి, నిర్మలమైన పర్యావరణానికి కట్టుబడి ఉందని తెలిపారు. 2030 సంవత్సరానికల్లా విద్యుత్ అవసరాలలో పునరుత్పాదక వనరుల నుండి ఉత్పత్తి జరుగుతుంది. దీని కోసం ఆర్థిక, సాంకేతికత స్థిరమైన సరఫరా అవసరమని అన్నారు.

Tags:    

Similar News