టీఎంసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

సందేశ్ ఖాలీ ఘటనలో ప్రధాన నిందితుడు షేక్ షాజహాన్ ప్రాంగణాల్లో విదేశీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ స్పందించింది.

Update: 2024-04-27 05:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సందేశ్ ఖాలీ ఘటనలో ప్రధాన నిందితుడు షేక్ షాజహాన్ ప్రాంగణాల్లో విదేశీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ స్పందించింది. పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని బీజేపీ నేత సువేంధు అధికారి డిమాండ్ చేశారు. అంతేగాక పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్టు చేయాలని తెలిపారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉపయోగిస్తూ టీఎంసీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. షాజహాన్ లాంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న టీఎంసీకి రాష్ట్రంలో అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు.

‘సందేశ్‌ఖాలీలో దొరికినవన్నీ విదేశీ ఆయుధాలే. ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్ధాలు భయంకరమైన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో వినియోగిస్తారు. ఈ ఆయుధాలన్నీ అంతర్జాతీయ ఉగ్రవాదులే వాడుతారు. కాబట్టి టీఎంసీని వెంటనే ఉగ్ర సంస్థగా ప్రకటించాలి. సందేశ్ ఖాలీ ఘటనతో రాష్ట్ర ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. అధికారంలో కొనసాగే నైతిక హక్కును టీఎంసీ కోల్పోయిందని విమర్శించారు.

కాగా, సందేశ్ ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపుల, భూకభ్జా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కీలక నిందితుడైన షేక్ హాజహాన్ ఇళ్లలో సీబీఐ శుక్రవారం సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో భాగంగా మూడు విదేశీ తుపాకులు, ఒక భారతీయ రివాల్వర్, 120 ఎంఎం బుల్లెట్లు, 50కాట్రిడ్జెస్ తదితర ప్రమాదకర ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. దీంతో టీఎంసీపై బీజేపీ మండిపడింది. అయితే దీనిపై టీఎంసీ నేత కునాల్ ఘోష్ అభ్యంతరం తెలిపారు. మందుగుండు సామగ్రిని సోదాలకు ముందే అక్కడ పెట్టి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News