ఎన్నికల ప్రచారంలో టీఎంసీ నాయకురాలి కారుపై దాడి
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మిటాలి బాగ్ కారుపై ఆదివారం దాడి జరిగింది.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మిటాలి బాగ్ కారుపై ఆదివారం దాడి జరిగింది. అయితే దీనిని బీజేపీ కార్యకర్తలు చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. తన కారుపై ఎమ్మెల్యే సుశాంత ఘోష్ మద్దతుతో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. లోక్సభ ఎన్నికల వేళ ఇప్పటికే సందేశ్ ఖాళీ ఘటన సంచలనంగా మారగా, ఇప్పుడు టీఎంసీ నాయకురాలి కారుపై దాడి చేయడంతో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ దాడిలో ఆమె కారు ముందు, వెనుక అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. సంబంధిత వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, నిందితులు ఆమెకు హానీ చేయాలనే ఉద్దేశ్యంతో వాహనాన్ని చుట్టుముట్టారని పేర్కొన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ ఈ సంఘటనను ఖండించింది, రాబోయే ఎన్నికల్లో ఓడిపోతున్నామని బీజేపీకి అర్థం అయింది, అందుకే వారు నిరాశ నిస్పృహలతో ఇలాంటి దాడులు చేస్తున్నారని పేర్కొంది. రాష్ట్రంలో పార్లమెంటరీ ప్రాతినిధ్యం కోసం హోరాహోరీ పోరు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత అగ్గి రాజేసింది. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 19, 26 తేదీల్లో ఇప్పటికే ఆరు లోక్సభ స్థానాలకు తొలిదశలో ఎన్నికలు జరగగా మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో తదుపరి ఎన్నికలు జరగనున్నాయి.