సాంకేతిక రంగంలో భారత్ దూసుకుపోతుంది- బిల్ గేట్స్
మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. మోడీ నివాసంలో పలు అంశాలపై చర్చించారు.
దిశ, నేషనల్ బ్యూరో: మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. మోడీ నివాసంలో పలు అంశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, వాతావరణ మార్పులు లాంటి పలు అంశాలపై చాలాసేపు చర్చించారు. మరోవైపు, భారతీయులపై బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించాడు. టెక్నాలజీని భారతీయులు వేగంగా అన్వయించుకుంటున్నారని అన్నారు. సాంకేతిక రంగంలో భారత్ దూసుకుపోతుందన్నారు. పీఎం నమో యాప్ లో ఫొటోబూత్ ఆప్షన్ ద్వారా బిల్ గేట్స్ తో మోడీ సెల్ఫీ దిగారు.
ఇక, డిజిటిల్ విప్లవంలో భారత్ వేగంగా ముందుకెళ్తుందని.. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధాని మోడీ. ఇండోనేషియాలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు గురించి ప్రస్తావన వచ్చింది. భారత్ లోని డిజిటల్ విప్లవం గురించి ప్రపంచదేశాలు ఆత్రుత ప్రదర్శించాయన చెప్పారు. 2023లో జరిగిన జీ20 సమ్మిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడుకున్నారో బిల్ గేట్స్ కి తెలిపారు మోడీ. ఏఐ ద్వారా కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో తన హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించినట్లు బిల్ గేట్స్ తో పంచుకున్నారు మోదీ. 'నమో డ్రోన్ దీదీ' పథకం గురించి బిల్ గేట్స్తో చెప్పారు మోడీ. దేశంలోని మహిళలను సాంకేతికత రంగాల్లో ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అయితే, జీ-20 సదస్సు సమగ్ర స్థాయిలో జరిగిందని.. భారత్ ఆ సదస్సును అద్భుతంగా నిర్వహించిందని మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. భారత్లో డిజిటల్ విభజన జరగకుండా చూస్తామన్నారు మోడీ. డిజిటల్ మౌళిక సదుపాయాల్ని ప్రతి గ్రామానికి తీసుకువెళ్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.