పీఆర్సీ నివేదిక కోసం ఉద్యోగుల ఎదురుచూపులు

దిశ, తెలంగాణ బ్యూరో : వేతన సవరణ నివేదికలో ఏముందనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. సీల్డ్​ కవర్ ఎప్పుడు ఓపెన్​ చేస్తారో అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కానీ సీఎస్​ సమక్షంలోని త్రిసభ్య కమిటీ మాత్రం దాన్ని ముట్టుకోవడం లేదు. మరోవైపు వేతన సవరణ కమిషన్ చైర్మన్​ బిస్వాల్​తో పాటు ఇద్దరు సభ్యులతో సీఎస్​ బుధవారం భేటీ అయ్యారు. కవర్​ ఓపెన్​ చేయకుండానే వారితో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్​ ప్రకటించిన సమయం దాటిపోయింది. ఈ […]

Update: 2021-01-06 22:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వేతన సవరణ నివేదికలో ఏముందనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. సీల్డ్​ కవర్ ఎప్పుడు ఓపెన్​ చేస్తారో అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కానీ సీఎస్​ సమక్షంలోని త్రిసభ్య కమిటీ మాత్రం దాన్ని ముట్టుకోవడం లేదు. మరోవైపు వేతన సవరణ కమిషన్ చైర్మన్​ బిస్వాల్​తో పాటు ఇద్దరు సభ్యులతో సీఎస్​ బుధవారం భేటీ అయ్యారు. కవర్​ ఓపెన్​ చేయకుండానే వారితో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్​ ప్రకటించిన సమయం దాటిపోయింది. ఈ నెల 6 లేదా 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ నివేదికపై చర్చించాలని, సమావేశం కావాలని సీఎం కేసీఆర్​ సూచించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వేతన సవరణ నివేదిక సీఎస్​కు అందించి తొమ్మిది రోజులకు చేరింది. వాస్తవంగా త్రిసభ్య కమిటీ దాన్ని అధ్యయనం చేయాలని ఆదేశించినా సీఎంకు ఇచ్చిన తర్వాతనే ఓపెన్​ చేస్తామని త్రిసభ్య కమిటీ అధికారులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్​ అప్పాయింట్​మెంట్​ కోసం వెయిటింగ్​లో ఉన్నారు. నేడో, రేపో సీఎం కేసీఆర్​ను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్​ను కలిసి నివేదిక అందించిన తర్వాత సీఎం నుంచి వెంటనే అనుమతి వస్తుందా, మళ్లీ అధ్యయనం కోసం వెయిట్​ అండ్​ సీ పద్ధతి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సీఎం కేసీఆర్​ నుంచి అపాయింట్​మెంట్​ వస్తే రెండు, మూడు రోజుల్లో సీఎస్​ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశం అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

నివేదిక ఇస్తారా…?

ప్రస్తుతం పీఆర్సీ నివేదిక ఉద్యోగ సంఘాలకు అందుతుందా లేదా అనేది సందేహంగా మారింది. గతంలో పీఆర్సీ ప్రకటించే ముందు ఉద్యోగ సంఘాల నుంచి వినతులు స్వీకరించడం, వాటిపై అధికారుల బృందం చర్చించినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు పీఆర్సీ నివేదికను కమిషన్​ నేరుగా సీఎంలకే ఇచ్చిందని, ఇప్పుడు మాత్రమే సీఎస్​కు ఇచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​కు సీఎస్​ మళ్లీ నివేదిక అందించడం, దాన్ని సీఎం పరిశీలించి, తర్వాత మళ్లీ సీఎస్​ ఆధ్వర్యంలోని కమిటీకి సూచించడం సాగదీయడమేననే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారికంగా ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదికను ఇవ్వలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఈసారి కమిషన్​ నుంచి నివేదిక అందిన తర్వాత ఉద్యోగ సంఘాలకు ఒక కాపీ ఇవ్వాలని సీఎం సూచించారని, కానీ ఇప్పటి వరకు దానిపై మాట్లాడేందుకు సీఎస్​ సమయం ఇవ్వడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. మూడు రోజుల కిందట మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఆధ్వర్యంలో టీఎన్జీఓ, టీజీఓ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల రాజేందర్​, ప్రతాప్​, మమత, టీజీఓ అధ్యక్ష, కార్యదర్శులు మమత, సత్యనారాయణ, పీఆర్​టీయూ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్​ సీఎస్​తో సమావేశమయ్యారు.

సమావేశంలో ఫిట్​మెంట్​, నివేదికకు సంబంధించిన అంశాలేమీ చెప్పలేదు. ఒకదశలో ఉద్యోగ సంఘాల చేతికి నివేదిక త్వరలోనే అందించడం కూడా కష్టమేననే ప్రచారం కూడా జరుగుతోంది. ఈసారి సీఎస్​తో భేటీ అయ్యేందుకు ఉద్యోగ సంఘాల నుంచి పలువురికి అవకాశం ఇవ్వాలని జేఏసీ చైర్మన్​, టీఎన్జీఓ అధ్యక్షుడు రాజేందర్​ సీఎస్​కు విజ్ఞప్తి చేశారు. గతంలో పీఆర్సీ అంశంలో ఉద్యోగ సంఘాలతో చర్చించినట్టుగానే ఈసారి కూడా అందరితో చర్చించాలని సూచించారు. జీఏడీ తరహాలోనే ఉద్యోగ సంఘాలను ఆహ్వానించాలని, పీఆర్సీ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి చెందిన అంశమని, అందరితో చర్చించాల్సిన అవసరముందని రాజేందర్​ సూచించారు.

Tags:    

Similar News