Hyundai Motor: జనరల్ మోటార్స్ తయారీ ప్లాంట్ కొనేందుకు హ్యూండాయ్ ప్రయత్నాలు!

వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ భారత్‌లో తన రెండో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది

Update: 2023-03-13 08:56 GMT

చెన్నై: వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ భారత్‌లో తన రెండో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. దీనికోసం మహారాష్ట్రలోని జనరల్ మోటార్స్ ఇండియాకు చెందిన తలెగావ్ తయారీ ప్లాంటును కొనేందుకు టర్మ్ షీట్‌పై సంతకం చేసినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. జనరల్ మోటార్స్‌కు చెందిన స్థలం, యంత్రాలు, భవనాలు, ఇతర కొన్ని ఆస్తులను కొనుగోలు చేయాలని హ్యూండాయ్ భావిస్తోంది. ప్రస్తుతానికి ఇరు సంస్థల మధ్య ప్రాథమిక దశలో ఒప్పందం మొదలైందని, నియంత్రణ సంస్థల అనుమతికి వెళ్లడానికి ముందు కొన్ని అంశాలపై చర్చించి, పూర్తి స్పష్టత కుదిరిన తర్వాత కొనుగోలు జరుగుతుందని కంపెనీ తెలిపింది. ఒప్పంద వ్యవహారం ఇప్పుడే మొదలైంది కాబట్టి ఒప్పంద విలువ ఎంత దానిపై కంపెనీ వివరణ ఇవ్వలేదు. దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్ మోటార్స్ భారత్‌లో చెన్నై సమీపంలోని ఇరుంగట్టుకోట్టైలో పెద్ద తయారీ కేంద్రాన్ని కలిగి ఉంది. గడిచిన 26 ఏళ్ల నుంచి అందులోనే ఉత్పత్తిని చేపడుతోంది. ఈ ప్లాంటు 7.50 లక్షల యూనిట్ల సామర్థ్యానికి కలిగి ఉండగా, వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు మరింత తయారీ సామర్థ్యం అవసరమని కంపెనీ భావిస్తోంది. హైదరాబాద్‌లో కంపెనీకి ఆర్అండ్‌డీ సెంటర్ ఉంది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి కూడా ప్రవేశించనున్నట్టు ఇదివరకు ప్రకటించింది. అందుకే జనరల్ మోటార్స్‌కు చెందిన ప్లాంట్ కోసం ప్రయత్నిస్తోంది.

Also Read...

ఇలా చేస్తే ఆడపిల్లల చదువులు, పెళ్లికి రూ. 63 లక్షలకు పైగా పొందొచ్చు!

 

Tags:    

Similar News