Tadepally CM Camp Office: సీఎం వైఎస్ జగన్‌తో మాజీమంత్రి బాలినేని భేటీ

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు...

Update: 2023-06-01 11:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి అంత యాక్టివ్ కాలేదు. మంత్రి పదవి పోయిన తర్వాత ఆయన అలకబూనడం వైసీపీ అధిష్టానంలోని పెద్దలు వెళ్లి బుజ్జగించడంతో ఆయన మెత్తబడ్డారు. అనంతరం చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా అధిష్టానం నియమించింది. అయితే సొంత జిల్లాలో ప్రాధాన్యం తగ్గడంతో ఆయన అలిగారు. అంతేకాదు మార్కాపురంలో సీఎం జగన్‌ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభానికి వచ్చిన సందర్భంగా కూడా బాలినేనికి సరైన గౌరవం దక్కలేదు. మరోవైపు పార్టీలోని కొందరు తనకు వ్యతిరేకంగా పని చేయడం, బావ వైవీ సుబ్బారెడ్డితో పొసగకపోవడంతో ఆయన రీజినల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు.

అనంతరం ఒంగోలులో ప్రెస్‌మీట్ పెట్టి కన్నీటి పర్యంతం అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తనకు గ్యాప్ వచ్చేలా కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను టికెట్లు ఇప్పించిన వారు సైతం తనపై నెగిటివ్‌గా ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రీజినల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయోద్దని వైసీపీ అధిష్టానంలోని కొందరు పెద్దలు కోరారు. సాక్షాత్తు సీఎం వైఎస్ జగన్ కోరినప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి వెనక్కి తగ్గలేదు. అయితే సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి రావాల్సిందిగా సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందింది. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read..

Ap News: ముందస్తు యోచనలో జగన్.. అక్టోబర్‌లో కేబినెట్ రద్దు..? 

Tags:    

Similar News