కళ్యాణ మండపంగా ‘రైతు వేదిక’.. సంచలనంగా మారిన పెళ్లి వేడుక

by  |
కళ్యాణ మండపంగా ‘రైతు వేదిక’.. సంచలనంగా మారిన పెళ్లి వేడుక
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల్లా బయ్యారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం, రైతు సమస్యల కోసం ఏర్పాటు చేసిన రైతు వేదికలో పెళ్లి వేడుకను ఘనంగా జరిపించారు. శనివారం రైతువేదికలో కోడూరి వెంకన్న, లక్ష్మీ దంపతుల ఏకైక పుత్రిక గౌతమిని భూపాలపల్లి జిల్లా గనపురం మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన దోనగంటి రమేష్ గౌడ్, వసంత పుత్రుడు ప్రశాంత్ గౌడ్‌కి ఇచ్చి వివాహం జరిపించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం, రైతు సమస్యల కోసం వ్యవసాయ అధికారులతో ముఖాముఖిగా చర్చించడం కోసం రైతు వేదికలను నిర్మిస్తే పెళ్లి వేడుకలు చేయడం ఏంటని పలువురు రాజకీయ నాయకులు ఆరోపించారు. రైతు వేదికలు రైతుల కోసం నిర్మించారా.. లేక రైతు వేదిక పేరుతో కల్యాణ మండపం నిర్మించారా.? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజల సొమ్ముతో కేసీఆర్ ఇలాంటి రైతు వేదికలను నిర్మించి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని పలువురు విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

కేసీఆర్ చేపట్టిన పథకాలలో డబుల్ బెడ్ రూమ్స్, రైతు వేదికలు వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్స్‌ను ప్రజల కోసం నిర్మిస్తే అవి కూలిపోతున్నాయని.. రాష్ట్రాన్నీ అప్పుల పాలు చేయడమే కేసీఆర్ లక్ష్యమని అఖిలపక్ష పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.

పినపాక మండలం రైతువేదిక అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాస్, వ్యవసాయశాఖ ఏఈఓ ఆధ్వర్యంలో రైతు వేదికలో పెళ్లి జరిగిందని సమాచారం. పేద కుటుంబం అని, పెళ్లి చేసే స్తోమత కుటుంబానికి లేదని తెలుసుకొని రైతు వేదికలో పెళ్లి వేడుకలు చేశారని గ్రామ ప్రజలు అంటున్నారు. నిజానికి ప్రభుత్వం రైతు వేదికలో పెళ్ళిళ్లు చేయమని ఎక్కడా నిర్దేశించ లేదు. మరి వ్యవసాయ అధికారులు, రైతు వేదిక అధ్యక్షుడు ముడుపుల కోసం పెళ్లి చేశారా.. లేక పేదకుటుంబాన్ని అదుకున్నారా అనే విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.


వ్యవసాయ శాఖ ఏఈఓ అధికారిని ‘దిశ’ విలేకరి వివరణ కోరగా జిల్లా అధికారులు పర్మిషన్ ఇచ్చారని, పెళ్లి జరిగే సమయంలో నేను లేనని ఫోన్ ద్వారా వివరణ ఇచ్చారు. పెళ్లి సమయంలో అధికారులు ఎందుకు లేరని గ్రామ ప్రజలు, పలువురు నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం రైతు వేదికల పేరుతో భవనాలను కల్యాణ మండపంగా మార్చారా.? లేక నిజంగా రైతుల కోసం నిర్మించారా.? అనేది గ్రామంలో సంచలనంగా మారింది. ఏది ఏమైనా రైతు వేదికలో పెళ్లి వేడుకలు జరిపించిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా.? లేక రైతు వేదికలు కల్యాణ మండపంగా మారుతాయా అనేది వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed