ఇప్పుడే కొనండి.. త్వరలో టీవీ ధరలు పెంచుతున్నారు

by  |
ఇప్పుడే కొనండి.. త్వరలో టీవీ ధరలు పెంచుతున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: గత నెల అంతర్జాతీయ మార్కెట్లో ఓపెన్-సెల్ ప్యానెళ్ల ధరలు 35 శాతం వరకు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా టీవీలు కొనేవారికి ఖర్చు పెరగనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎల్‌జీ వంటి కంపెనీలు టీవీ ఉత్పత్తులపై ధరలను పెంచేశాయి. రానున్న కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి పానాసోనిక్, హైయర్, థామ్సన్ కంపెనీలు కూడా ధరలను పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాయి. ‘ఇటీవల కొద్దిరోజులుగా టీవీ ప్యానెళ్ల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. టీవీల ధరలు కూడా. రానున్న ఏప్రిల్ నాటికి టీవీలు 7 శాతం వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని’ పానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా సీఈఓ మనీష్ శర్మ చెప్పారు.

‘ఇప్పుడున్న ధరలు ఇదే ధొరణిలో పెరిగితే, తాము కూడా టీవీల ధరలను పెంచక తప్పదని’ హైయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ అభిప్రాయపడ్డారు. టీవీల తయారీలో కీలకమైన ఓపెన్-సెల్ ప్యానెళ్లు నెల రోజుల వ్యవధిలోనే 35 శాతం మేర పెరిగాయి. దేశీయంగా డిమాండ్ ఉన్న స్థాయిలో ఈ ఓపెన్-సెల్ ప్యానెళ్ల తయారీ లేక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా కేవలం 8 నెలల వ్యవధిలో వీటి ధరలు 3 రెట్లు పెరిగాయని థామ్సన్ కంపెనీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి టీవీల ధరల్లో రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు పెంపు ఉండొచ్చని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇందులో 32 ఇంచుల టీవీలు రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు పెరగొచ్చని కంపెనీలు వెల్లడించాయి.



Next Story