‘మరో 20 ఏళ్లు అధికారంలో టీఆర్ఎస్ పార్టీనే’

by  |
‘మరో 20 ఏళ్లు అధికారంలో టీఆర్ఎస్ పార్టీనే’
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప.. హత్యలుండవని మాజీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారన్నారు. రాజేందర్‌కు సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఈటల ఆత్మరక్షణ కోసం కాదని, ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి వెళ్తున్నారని, ఆత్మగౌరవం కోసం కాదని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల ఓడిపోవడం ఖాయమని, ఆయన్ను దేవుడు కూడా గెలిపించలేడని వ్యాఖ్యానించారు. మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని, 2026 ఎన్నికల్లో రిజర్వేషన్లు మారతాయని, ఆ సమయానికే నియోజకవర్గాల డి-లిమిటేషన్ పూర్తవుతుందని చెప్పారు.

టీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించిందని, 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులతో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని వివరించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టినా.. సీఎం కేసీఆర్ రైతులకు ఇబ్బందుల్లేకుండా చూశారని తెలిపారు. ధాన్యం పండించడంలో అతి త్వరలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పడిపోయిందని, మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురయ్యిందన్నారు. నా కొడుకు అమిత్ రెడ్డి మొదట్నుంచీ క్రమశిక్షణతో పెరిగాడని, ఇలాంటి ఆపత్కాలంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా మా నాన్న పేరు మీద గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటామని వివరించారు.



Next Story

Most Viewed