పెను ఉప్పెన.. పెగాసెస్.. ది వైర్ పోర్టల్ సంచలన కథనం

by  |
పెను ఉప్పెన.. పెగాసెస్.. ది వైర్ పోర్టల్ సంచలన కథనం
X

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు ముందు పెగాసెస్ పెను ఉప్పెనలా దేశ రాజకీయాలను కుదిపేస్తున్నది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూపు అభివృద్ధి చేసిన స్పైవేర్ పెగాసెస్‌‌ను లక్షిత వ్యక్తుల ఫోన్‌లలోకి చొప్పించి నిఘా పెడుతున్నదని కేంద్రంపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే స్పైవేర్ పెగాసెస్‌ను పంపిన లేదా పంపడానికి లక్ష్యంగా ఎంచుకున్న వారి జాబితా ఎన్ఎస్‌వో గ్రూపు నుంచి లీక్ అయింది. ఆ లిస్టులో 300 మంది భారతీయుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఈ జాబితాను తొలిసారిగా యాక్సెస్ చేసిన ఫ్రెంచ్ స్వచ్ఛంద సంస్థ ఫర్‌బిడెన్ స్టోరీస్, ఆమ్నెస్టీ ఇంటర్నేషన్‌‌లు 16 మీడియా సంస్థలతో పంచుకున్నాయి. ఇందులో ‘ది వైర్’ కూడా ఉన్నది.

ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీల పేర్లున్నట్టు ది వైర్ సంస్థ కథనం ప్రచురించింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్‌‌ల ఫోన్ నెంబర్లూ లీక్ అయిన జాబితాలో ఉన్నాయి. వీరితోపాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై 2019లో లైంగిక ఆరోపణలు చేసిన మహిళ, ఆమె భర్త, ఇతర బంధువులకు చెందిన 11 మొబైల్ ఫోన్‌ నెంబర్లు ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని మూడు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో పేర్కొన్న ఏకైక ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా కూడా నిఘాకు టార్గెట్‌గా ఉన్నట్టు తేలింది. రాహుల్ గాంధీకి చెందిన రెండు ఫోన్ నెంబర్లు, మరో ఐదుగురి తన మిత్రుల ఫోన్ నెంబర్లూ జాబితాలో ఉన్నాయి. అయితే, ఈ లీక్ డేటాబేస్‌లో ఉన్న ఫోన్ నెంబర్‌లన్నింటిపై నిఘా వేసినట్టు కాదు. నిర్దేశిత కాలంలో ఆ ఫోన్‌లపై ఫోరెన్సిక్ అనాలిసిస్ చేస్తేనే స్పైవేర్ అటాక్ చేసిందా? లేదా? అన్నది వెల్లడవుతుంది. రాహుల్ గాంధీకి చెందిన రెండు ఫోన్‌పై ఫోరెన్సిక్ అనాలిసిస్ జరగలేదు. ఇప్పుడు గాంధీ ఆ నెంబర్లను వాడట్లేదని తెలిసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్‌పై పలుసార్లు పెగాసెస్ దాడి జరిగింది. తాను ఐదు సార్లు మొబైల్ హ్యాండ్‌సెట్ మార్చారని, అయినా స్పైవేర్ బెడద తప్పలేదని పీకే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

క్లిక్ చేయకున్నా.. పెగాసెస్ ఎంటర్

సాధారణంగా మాల్వేర్‌ను ఎంటర్ చేయడానికి హ్యాకర్లు ట్రాప్ మెస్సేజీలు, మెయిల్స్, లేదా ఇతరత్రాలను పంపిస్తారు. ఆ లింక్‌లపై క్లిక్ చేస్తే మాల్వేర్ డివైజ్‌లోకి ఎంటర్ అవుతుంది. కానీ, పెగాసెస్‌కు ఆ అవసరమూ లేదు. హ్యాకర్ కచ్చితంగా ఒకరిని టార్గెట్ చేస్తే ఆ వ్యక్తి ఫోన్‌లోకి సులువుగా పెగాసెస్‌ను పంపించగలరు. వినియోగదారుడి అనుమతి లేకుండా అన్ని ఫైల్స్‌ను యాక్సెస్ చేయగలరు. కావాల్సిన సమాచారాన్ని సేకరించుకోగలరు.

ఎలా పనిచేస్తుంది?

టార్గెట్ పర్సన్‌కు ట్రాప్ లింక్ పంపుతారు. దీన్ని క్లిక్ చేయగానే డివైజ్‌లోకి స్పైవేర్ ఎంటర్ అవుతుంది. లేదా పర్సన్ ఇన్‌పుట్ లేకుండానే జీరో క్లిక్ హ్యాక్స్ విధానంలో ఫోన్‌లోకి పెగాసెస్ స్పైవేర్‌ను పంపవచ్చు. డివైజ్‌లోకి స్పైవేర్ ఎంటర్ అయ్యాక ఫోన్ బేసిక్ ఫంక్షన్‌ తన అధీనంలోకి తీసుకుంటుంది. ఒక్కోసారి యూజర్ కంటే ఎక్కువగా ఈ స్పైవేర్ డివైజ్‌పై నియంత్రణ కలిగి ఉంటుంది. లొకేషన్ డేటా, కాల్ లాగ్స్, కాంటాక్టుల వివరాలతోపాటు కెమెరా, మైక్రోఫోన్ రికార్డింగ్‌లనూ చేరవేస్తుంది.



Next Story