పీడియాట్రిక్​లో ఆరోగ్య శ్రీ పెరగాలి.. ప్రతి వారం ఓ ఆసుపత్రిపై రివ్యూ: మంత్రి

by Dishafeatures2 |
పీడియాట్రిక్​లో ఆరోగ్య శ్రీ పెరగాలి.. ప్రతి వారం ఓ ఆసుపత్రిపై రివ్యూ: మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పీడియాట్రిక్​విభాగంలో ఆరోగ్య శ్రీ రిజిస్ట్రేషన్లు పెరగాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు పేర్కొన్నారు. ప్రసూతి, ఆర్థోపెడిక్​, జనరల్​ సర్జరీల్లోనూ ఆరోగ్యశ్రీని ఎక్కువ మందికి వర్తింపజేయాలన్నారు. శనివారం వైద్య ,విద్య పరిధిలోని ఆసుప‌త్రుల ప‌నితీరుపై ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. హెల్త్ సెక్రెట‌రీ రిజ్వీ, డీఎంఈ ర‌మేష్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధ‌ర్‌, అన్ని ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, హెచ్‌వోడీలు, ఆర్ఎంవోలు, సీఎస్ ఆర్ఎంవోలు దీనిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసుపత్రుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని ముందుకు వెళ్లాలన్నారు.

ఆపరేషన్​ థియేటర్ల వినియోగం పెరగాలన్నారు. సీ సెక్షన్లను గణనీయంగా తగ్గించి , సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. ఈఎన్టీ, డెర్మటాలజీ సేవ‌ల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చాలన్నారు. స‌మీప గ్రామాల్లో ఈఎన్టీ క్యాంపులు ఏర్పాటు చేసి సేవ‌లు అందించాలన్నారు. ఇక నుంచి ప్రతి వారం ఓ ఆసుపత్రిపై రివ్యూ నిర్వహిస్తానని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అత్యవసర సేవ‌లు అన్ని వేళ‌లా అందించేందుకు వీలుగా అన‌స్థీషియా విభాగం క్రియాశీలకంగా ఉండాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story

Most Viewed