ఎయిర్​షోలో అడ్డగోలు దోపిడీ.. రూ.590 కట్టినా గ్రిల్స్​బయటే!

by Disha Web Desk 2 |
ఎయిర్​షోలో అడ్డగోలు దోపిడీ.. రూ.590 కట్టినా గ్రిల్స్​బయటే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బేగంపేట 'వింగ్స్​ఇండియా-2022' ఏవియేషన్​షోలో అడ్డగోలు దోపిడీ జరుగుతోంది. షో చూసేందుకు వచ్చే సామాన్య విజిటర్లు రూ.590 చెల్లించినా కనీసం గ్రిల్స్​కూడా దాటనివ్వడంలేదు. వాస్తవానికి సాధారణ విజిటర్లకు టికెట్​రేటు రూ.500 ఉండగా అన్ని ట్యాక్సులు కలిపి రూ.590 ఖర్చవుతోంది. బిజినెస్​విజటర్లకు రూ.1875 ఉండగా ట్యాక్సులు కలిపి రూ.2950 చెల్లించాల్సి వస్తోంది. ఎంతో కష్టపడి అంతదూరం వస్తే విమానలకు కనీసం దగ్గర నుంచి చూసేందుకు అవకాశం కల్పించలేకపోవడంతో నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా బిజినెస్​విజిటర్ల నుంచి రూ.2950 తీసుకున్నా వారిని కూడా విమానంలోకి ఎక్కి చూసేందుకు అవకాశం కల్పించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అదీగాక కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంపై మండిపడ్డారు. ఎంతోదూరం నుంచి షో చూసేందుకు కుటుంబాలు, చిన్న పిల్లలతో సహా వచ్చిన సందర్శకులు ఎండలు తీవ్రంగా ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్వాహకులపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు.

బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో మూడోరోజు కొనసాగింది. గురువారం ప్రారంభమైన ఈ షో మొదటి రెండు రోజులు బిజినెస్​సంబంధిత కార్యకలాపాలు జరిగాయి. కాగా శని, ఆదివారాల్లో సామాన్యుల వీక్షణకు అవకాశం కల్పించాయి. అయితే మొదటి రెండ్రోజుల వరకు దాదాపు 15కు పైగా విమానాలు, హెలికాప్టర్లు, జెట్లను ప్రదర్శనలో ఉంచగా శనివారం ప్రేక్షకుల వీక్షణ సమయానికి 8 వరకు మాత్రమే ఉండటం గమనార్హం. గతంలో నిర్వహించిన ఎయిర్​షోల్లో చాలా విమానాలను ప్రదర్శనకు నిలిపేవారని, విమానాల్లోకి వెళ్లేందుకు కూడా అనుమతించేవారని షోకు వచ్చిన ప్రజలు చెబుతున్నారు. ఈసారి అంతమొత్తంలో విమానాలు లేవు, కనీసం చూద్దామన్నా కూడా దగ్గరి వరకు వెళ్లనివ్వడంలేదని సందర్శకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

వింగ్స్​ఇండియా ఎయిర్​షోపై కొవిడ్​ఎఫెక్ట్​భారీగానే పడింది. గతంలో పదుల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్లు, జెట్లను ప్రదర్శనలో ఉంచగా ఈసారి తక్కువ మొత్తంలో విమానాలను షోలో ప్రదర్శించారు. అంతేకాకుండా షోకు వచ్చే వారు కూడా భారీగా తగ్గిపోయారు. ఇప్పుడు జరుగుతున్న షోకు కూడా వచ్చిన వారిలో చాలామంది ఏవియేషన్ కోర్సు చదువుతున్న విద్యార్థులే వచ్చారు. వారు మినహా ప్రజల నుంచి పెద్దగా స్పందన రాకపోవడం గమనార్హం.

విమానాలను దగ్గర నుంచి చూద్దామని వచ్చా: సంపత్ కుమార్, తెల్లాపూర్

ఎయిర్​షో కోసం కుటుంబ సభ్యులతో కలిసివచ్చా. ఒక్కొక్కరం రూ.590 చెల్లించాం. తీరా ఇక్కడికి వచ్చాక గ్రిల్స్​దాటి విమానాల దగ్గర వరకు వెళ్లాలంటే వేరే రేటు ఉంటుందని చెప్పారు. ఆశపడి వస్తే చేసేదేం లేక నిరాశగా వెనుదిరిగాం. చిన్న పిల్లలతో వచ్చాం. ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నాం. కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి.

ఈసారి షో అంతంతమాత్రమే: శివ కుమార్, హైదరాబాద్, రామంతపూర్

ప్రతి ఏడాది ఏవియేషన్​షోకు వస్తుంటా. గతంలో ఉన్నంత అద్భుతంగా ఈ ఏడాది లేదు. విమానాల సంఖ్య తక్కువగా ఉంది. గతంలో విమానం ఎక్కేందుకు అనుమతించేవారు. కానీ, ఈ ఏడాది కనీసం చూసేందుకు కూడా నిర్వాహకులు అనుమతించలేదు. మళ్లీ రెండేళ్లకోసారి ఈ షో జరుగుతుంది. అప్పటి వరకు ఇంకెన్ని మార్పులు జరుగుతాయో చూడాలి.



Next Story

Most Viewed